మీరు మాత్రం 2028 టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా రావొద్దయ్యా.. మా ఇజ్జత్ పోయేలా ఉందిగా
Adam Gilchrist Declares Team India Unstoppable: స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ 2026 గెలిచిన టీం ఇండియాపై ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించారు. యువ జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ వరుస విజయాలు సాధిస్తోందని ఆయన అన్నారు. ఒకప్పుడు నాకౌట్ మ్యాచ్లలో వణికే భారత జట్టును చూసి ఇప్పుడు మిగతా జట్లు భయపడుతున్నాయని, టీం ఇండియా అత్యంత బలమైన జట్టు అని గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించారు.

Adam Gilchrist Hails Dominant Team India After T20 World Cup 2026 Win: ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్ల ఆధిపత్యం సుదీర్ఘకాలం నడిచింది. అయితే, గత కొంతకాలంగా ఈ రెండు దిగ్గజ జట్లను కూడా అధిగమిస్తూ, భారత జట్టు వరుస టైటిళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో విజేతగా నిలిచిన టీం ఇండియా, రికార్డు స్థాయిలో తమ మూడో పొట్టి కప్పును సొంతం చేసుకుంది. మొత్తంగా చూస్తే, ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లలో భారత ఖాతాలో ఇది ఎనిమిదో టైటిల్. అత్యధిక ట్రోఫీలు గెలుపొందిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియాకు భారత్ చేరువలో ఉంది. ఇదే దూకుడు కొనసాగితే, మరో రెండేళ్లలో ఈ రికార్డును బ్రేక్ చేసినా ఆశ్చర్యపడనవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భారత జట్టు అద్భుత ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అప్పటి నుంచి యువ సారథి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీం ఇండియా యువ జట్టు వరుస సిరీస్లలో విజయకేతనం ఎగురవేస్తోంది. ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ జట్టుతోనైనా సరే, టీం ఇండియాదే సిరీస్ అన్నంతగా జట్టు రెచ్చిపోతోందని గిల్ క్రిస్ట్ అన్నారు.
ముఖ్యంగా, ఐపీఎల్లోని పది జట్లలోని సెలెక్ట్ అయిన ఆటగాళ్లందరూ కలిసి ఒక టీం ఇండియాగా మారినట్టు ఉందని, అందుకే ప్రపంచంలోని ఏ జట్టునైనా టీం ఇండియా సులువుగా ఎదుర్కొంటుందని గిల్ క్రిస్ట్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని జట్ల కంటే టీం ఇండియా చాలా బలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో టీం ఇండియా మిగతా జట్లను చూసి వణికేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, టీం ఇండియాను చూసి మిగతా జట్లు వణికిపోతున్నాయని గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా భారత బ్యాటర్లు ఎలాంటి బౌలింగ్నైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నారని గిల్ క్రిస్ట్ పేర్కొన్నారు. ప్రస్తుత టీం ఇండియా బౌలింగ్ కంటే కూడా బ్యాటింగ్ తీరుతోనే వరుస విజయాలు దక్కించుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఈ జట్టు మరో రెండేళ్ల పాటు ఏ సిరీస్ను కూడా కోల్పోయే అవకాశం లేదని గిల్ క్రిస్ట్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే టీం ఇండియా జట్టు పొరపాటున 2028 టీ20 వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియాకు రాకూడదని తాను కోరుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే టీం ఇండియాను చూస్తే ఏ ప్రాంతంలోనైనా సరే ఎదురు లేకుండా విజయాలతో దూసుకుపోతుందని ఆయన అన్నారు. గత రెండేళ్లలో ఆ జట్టు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని, స్వదేశంలో ఏకంగా టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలవడంతో, టీం ఇండియాను ఇప్పుడు ఎదుర్కోవడం ఏ జట్టుకైనా చాలా కష్టమంటూ గిల్ క్రిస్ట్ తన విశ్లేషణను ముగించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



