పొలంలో వేసే యూరియా ఎలా తయారవుతుందో తెలుసా? దీన్ని వెనకున్న కథ చిన్నది కాదు..
పంట అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది యూరియా. కానీ మార్కెట్లో లభించే ఈ తెల్లటి గింజల వెనుక దేశ సరిహద్దులు దాటి సాగే ఒక భారీ నెట్వర్క్ ఉందనే విషయం మీకు తెలుసా? సముద్ర గర్భంలోని గ్యాస్ క్షేత్రాలు, అంతర్జాతీయ ఎల్ఎన్జీ టెర్మినల్స్ నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం.. కెమికల్ కంపెనీలు, రైల్వే నెట్వర్క్ మీదుగా చివరకు రైతు పొలం వరకు సాగుతుంది.

వ్యవసాయం అనగానే ప్రతీ రైతుకు ముందుగా గుర్తుకొచ్చే పేరు యూరియా. పంట ఏదైనా సరే.. చెట్టు పచ్చగా, ఏపుగా పెరగడానికి పొలంలో యూరియా చల్లాల్సిందే. అయితే బస్తాల్లో మనకు లభించే ఈ తెల్లటి రసాయన ఎరువు అసలు ఎలా తయారవుతుంది? ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువు రైతు పొలం వరకు ఎలా చేరుకుంటుంది? అనే విషయాలు చాలామందికి తెలియవు. మొక్కల ఎదుగుదలకు అత్యంత అవసరమైన నైట్రోజన్ని అందించే ప్రధాన మూలం యూరియా. ఘన రూపంలో లభించే ఎరువులలో అత్యధికంగా 46శాతం నైట్రోజన్ కలిగిన ఏకైక ఎరువు ఇది. మనం కొనే ప్రతి 45 కిలోల యూరియా బస్తాలో దాదాపు 20.7 కిలోల నైట్రోజన్ సత్తువ ఉంటుంది. మిగతా ఎరువులతో పోలిస్తే ధర తక్కువగా ఉండటం, ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం వల్ల మనదేశంలో వరి, పత్తి, చెరకు, మొక్కజొన్న రైతులు దీనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.
గాలి, నీరు, గ్యాస్తో ఎరువు తయారీ..
యూరియా తయారీ ప్రక్రియ వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ప్రధానంగా సహజ వాయువు, గాలి, నీరు ముడి పదార్థాలుగా పనిచేస్తాయి.
గ్యాస్ రవాణా: మనదేశంలోని కేజీ బేసిన్, బొంబాయి హై తో పాటు రష్యా, ఖతార్ వంటి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జీ గ్యాస్ను ఫ్యాక్టరీలకు తరలిస్తారు.
అమ్మోనియా ఉత్పత్తి: గ్యాస్ నుంచి లభించే హైడ్రోజన్, గాలిలో ఉండే నైట్రోజన్ను అధిక పీడనం వద్ద కలిపి అమ్మోనియా తయారు చేస్తారు.
రసాయన చర్య: ఈ అమ్మోనియాకు కార్బన్ డయాక్సైడ్ జోడించి ద్రవరూప యూరియాగా మారుస్తారు.
పూసల్లాంటి గింజలు: పెద్ద పెద్ద ప్రిల్లింగ్ టవర్ల పైనుంచి ఈ ద్రవాన్ని కిందకు చిలకరించడం వల్ల, అది గాలికి చల్లబడి తెల్లటి గుండ్రటి గింజలుగా మారుతుంది.
మనదేశంలో ప్రధాన ప్లాంట్లు
భారతదేశంలో ప్రతి ఏటా 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా ఉత్పత్తి అవుతోంది. తెలంగాణలోని రామగుండం, ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశాల్లోని భారీ కర్మాగారాల్లో ఇది నిరంతరం తయారవుతోంది.
నీమ్ కోటింగ్ వెనుక అసలు కథ
గతంలో యూరియాను నాన్-అగ్రి కేటగిరీకి అనధికారికంగా మళ్లించేవారు. దానిని అరికట్టడమే కాకుండా భూమిలో వేసిన యూరియా త్వరగా ఆవిరైపోకుండా ఉండటానికి ప్రతి బస్తాకూ వేపనూనె పూత తప్పనిసరి చేశారు. దీనివల్ల నైట్రోజన్ నిదానంగా విడుదలవుతూ మొక్కలకు ఎక్కువ రోజులు బలాన్నిస్తుంది.
ఫ్యాక్టరీ నుండి మీ చేతికి ఎల్లా వస్తుంది?
- గ్యాస్ క్షేత్రాలు నుంచి యూరియా ప్లాంట్.. ఈ తర్వాత ప్యాకింగ్
- రైల్వే గూడ్స్ రేక్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయి గోదాములకు చేరిక
- సొసైటీలు, ప్రైవేట్ డీలర్లకు పంపిణీ
- ఆధార్ ఆధారిత POS మెషిన్ ద్వారా రైతుకు విక్రయం
రైతులు గుర్తుంచుకోవాల్సిన నిజం
చాలామంది యూరియా ఎక్కువ చల్లితే దిగుబడి ఎక్కువ వస్తుందని పొరబడతారు. కానీ మితిమీరిన వాడకం వల్ల పైరుపై పురుగుల దాడి పెరుగుతుంది. అలాగే నేల సారం దెబ్బతింటుంది. కాబట్టి నేల పరీక్ష నివేదికను బట్టి పొటాష్, భాస్వరం ఎరువులతో పాటు తగిన మోతాదులోనే యూరియాను వాడటం మంచిది.
