AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

199 నిమిషాల బ్యాటింగ్.. 42 బంతుల్లో 178 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టాడు..

Suryakumar Yadav: టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయాల్లో...

199 నిమిషాల బ్యాటింగ్.. 42 బంతుల్లో 178 పరుగులు.. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టాడు..
Suryakumar
Ravi Kiran
|

Updated on: Dec 25, 2021 | 12:35 PM

Share

టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ అద్భుత విజయాల్లో ‘స్కై’ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అయితే ఇదేం అంతర్జాతీయ సిరీస్ లేదా టోర్నీ మ్యాచ్ కాదు. ముంబైలో జరిగిన 74వ పోలీస్ షీల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఈ 30 ఏళ్ల భారత్ బ్యాట్స్‌మెన్ విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి జట్టు పెయిడ్ స్పోర్ట్స్ క్లబ్‌ బౌలర్లను ఊచకోత కోసి 152 బంతుల్లో 249 పరుగులు చేశాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి పర్సీ జింఖానా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 524 పరుగులు చేసింది.

249 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యాడు. 152 బంతులు ఎదుర్కొన్న అతడు 37 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. అంటే బౌండరీల రూపంలో 42 బంతుల్లో 178 పరుగులు సాధించాడని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ రెండు పెద్ద భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఆదిత్య తారే(73)తో కలిసి నాలుగో వికెట్‌కు 124 పరుగులు జోడించగా.. సచిన్‌ యాదవ్‌(63)తో కలిసి ఐదో వికెట్‌కు 209 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. 199 నిమిషాల పాటు అద్భుతమైన బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ తమ జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. అయితే 250 నమోదు చేయకుండానే ఎడమ చేతివాటం బౌలర్ అతిఫ్ అత్తర్వాలా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.