Video: సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా.. ఈ మ్యాచ్ క్లైమాక్స్ మాములుగా లేదుగా..!
Hyderabad Cricket Match: హైదరాబాద్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఆస్ట్రేలియా 350 పరుగులు చేయగా, సచిన్ టెండూల్కర్ అద్భుతమైన 175 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. విజయానికి అతి చేరువగా వచ్చి భారత్ కేవలం మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ సచిన్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Hyderabad Cricket Match: 2009లో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయిన అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లలో ఒకటి. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ అద్భుతమైన 175 పరుగుల ఇన్నింగ్స్, భారత్ విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయిన తీరు క్రికెట్ అభిమానులను కలచివేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు షేన్ వాట్సన్, షాన్ మార్ష్ భారత బౌలర్లపై ఆరంభం నుంచే దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శించారు. వాట్సన్ తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపించగా, మార్ష్ క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. వాట్సన్ 93 పరుగులు చేసి అవుట్ కాగా, వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ రికీ పాంటింగ్ మార్ష్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. షాన్ మార్ష్ తన శతకాన్ని పూర్తి చేసుకుని 112 పరుగుల వద్ద అవుటయ్యాడు. డెత్ ఓవర్లలో మైక్ హస్సీ వేగంగా పరుగులు రాబట్టడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్కు 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సెహ్వాగ్ వేగంగా పరుగులు చేయగా, సచిన్ ఆచి తూచి ఆడాడు. 38 పరుగులు చేసిన సెహ్వాగ్ అవుటవడంతో తొలి వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. యువరాజ్ 26 పరుగులు చేసి అవుటవగా, సచిన్ మాత్రం ఒకవైపు క్రీజులో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేశాడు. అద్భుతమైన ఫోర్లు, ఆకాశాన్ని అంటిన సిక్సర్లతో హైదరాబాద్ మైదానాన్ని హోరెత్తించాడు. యువరాజ్ తర్వాత వచ్చిన ఎం.ఎస్. ధోని కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు.
ఎక్కువమంది చదివినది: SL vs IND: కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబులో భారీ జంప్..?
ఈ క్రమంలోనే సచిన్ కేవలం 81 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సురేష్ రైనాతో కలిసి సచిన్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రైనా దూకుడైన బ్యాటింగ్ తో భారత్ విజయానికి చేరువవుతుందని భావించారు. అయితే 59 పరుగుల వద్ద రైనా, ఆ తర్వాత హర్భజన్ సింగ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ ఆశలు సన్నగిల్లాయి. అప్పటికి చివరి 48 బంతుల్లో భారత్కు 52 పరుగులు కావాలి. రవీంద్ర జడేజా నాలుగు ఫోర్లతో ఆశలు రేకెత్తించాడు. మ్యాచ్ చివరి దశకు చేరుకోగా, భారత్కు 18 బంతుల్లో 18 పరుగులు అవసరం అయ్యాయి. సరిగ్గా అదే సమయంలో, 175 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్ అనూహ్యమైన షాట్ ఆడి అవుట్ అయ్యాడు. సచిన్ అవుటవడంతో భారత్ విజయం దాదాపు అసాధ్యంగా మారింది. ఆ తర్వాత జడేజా కూడా రనౌట్ అయ్యాడు. చివరిలో ప్రవీణ్ కుమార్ ఒక సిక్స్ కొట్టి ఆశలు రేకెత్తించినప్పటికీ, భారత్ లక్ష్యానికి కేవలం మూడు పరుగుల దూరంలో 347 పరుగులకు ఆలౌట్ అయింది.
సచిన్ టెండూల్కర్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లోని అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచిపోయింది. ఒంటరిగా పోరాడి జట్టును గెలుపు అంచులకు తీసుకువచ్చిన సచిన్, అప్పటికే 17,000 ODI పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. ఈ మ్యాచ్ ఓటమి భారత్ అభిమానులను నిరాశపరిచినా, సచిన్ టెండూల్కర్ ధైర్యం, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
