Asia Cup: 4 నెలలైనా భారత్కు అందని ఆసియా కప్.. ట్రోఫీపై నఖ్వీ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే?
Mohsin Naqvi, Asia Cup 2025: సూర్య కుమార్ సారథ్యంలో ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ఇంతవరకు ట్రోఫీ అందలేదు. తన చేతితో ట్రోఫీ తీసుకోకపోవడంతో అలిగిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఏసీసీ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ హోం మంత్రిగా ఉన్న మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ తీసుకుని పారిపోయాడు. తాజాగా ట్రోఫీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

Mohsin Naqvi, Asia Cup 2025: సెప్టెంబర్ 28, 2025న జరిగిన ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఘనవిజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్ను వరుసగా మూడుసార్లు ఓడించి చిత్తు చేసింది. అయితే, ఈ విజయం సాధించి మూడు నెలలు గడిచినా టీమ్ ఇండియాకు మాత్రం విన్నింగ్ ట్రోఫీ అందలేదు. సాధారణంగా టోర్నమెంట్ గెలిచిన వెంటనే విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తారు. కానీ మొహ్సిన్ నఖ్వీ ఇప్పటివరకు ఆ ట్రోఫీని భారత్కు ఇవ్వలేదు.
భారత్కు ట్రోఫీ ఇవ్వని మొహ్సిన్ నఖ్వీ..
ఆసియా కప్ చరిత్రలో ఏ జట్టు గెలిచినా ఆ రోజే అధికారికంగా ట్రోఫీని అందజేయడం ఆనవాయితీ. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు, ఏసీసీ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ హోం మంత్రిగా ఉన్న మొహ్సిన్ నఖ్వీ హయాంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఆసియాలోనే అత్యంత బలమైన జట్టుగా భారత్ గెలిచినప్పటికీ, నఖ్వీ ట్రోఫీని అందజేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది?
ఈ వివాదం అంతా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసున్న ఒక నిర్ణయంతో మొదలైంది. పాకిస్థాన్ హోం మంత్రి, పీసీబీ అధ్యక్షుడైన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి సూర్య నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన నఖ్వీ ట్రోఫీని తీసుకుని మైదానం నుంచి వెళ్ళిపోయాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నఖ్వీని ఈ ట్రోఫీ గురించి అడగ్గా, “ట్రోఫీ ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉంది” అని బదులిచ్చాడు. దీనిని బట్టి భారత్కు ఇంకా ట్రోఫీ అందలేదని స్పష్టమవుతోంది. తాజా నివేదికల ప్రకారం, ఈ ట్రోఫీని దుబాయ్లోని ఐసీసీ అకాడమీ కాంప్లెక్స్లో ఉన్న ఏసీసీ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. కేవలం అనుమతి ఉన్న అధికారులు మాత్రమే అక్కడికి వెళ్లగలరు. ఈ వివాదం ముగిసే వరకు దానిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
భారత్కు ట్రోఫీ ఎప్పుడు అందుతుంది?
బీసీసీఐ, ఏసీసీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ మధ్య ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. నఖ్వీ స్వయంగా తన చేతులతోనే భారత్కు ట్రోఫీ ఇవ్వాలని పట్టుబడుతుండగా, అతని చేతుల మీదుగా తీసుకోవడానికి టీమ్ ఇండియా సిద్ధంగా లేదు. ఐసీసీ కూడా ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. మరి భారత్కు దక్కాల్సిన తన హక్కు (ట్రోఫీ) ఎప్పుడు అందుతుందో వేచి చూడాలి.




