Gas Booking: గ్యాస్ బుకింగ్స్పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ వెయింట్ పీరియడ్లో మార్పులు చేసింది. 45 రోజులకు వెయిటింగ్ పీరియడ్ను పెంచింది. గతంలో ఇది 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు మరోసారి పెంచింది. ఈ మేరకు గురువారం మరో ప్రకటన జారీ చేసింది.

గ్యాస్ బుకింగ్స్పై కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరత క్రమంలో గ్యాస్ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచింది. ఈ మేరకు గురువారం ప్రకటన జారీ చేసింది. గతంలో గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్నాక 21 రోజుల తర్వాత మరో గ్యాస్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ గ్యాస్ కొరత వల్ల దానిని ఇటీవల 25 రోజులకు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్యాస్ సంక్షోభం దేశంలో ముదురుతుండటంతో.. మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల గ్యాస్ కొరత తగ్గతుందని, బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది.
దేశంలో ముదురుతున్న సంక్షోభం
దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత సంక్షోభం తీవ్రతరమవుతోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల పంపిణీని కేంద్రం నిలిపివేయడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా ఆగిపోయింది. దీంతో గ్యాస్ నిల్వలు లేకపోవడంతో రెస్టారెంట్లు, హోటల్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో మూత పడుతున్నాయి. దీని వల్ల వ్యాపారులకు నష్టం జరుగుతుండగా.. హోటల్స్తో పాటు రెస్టారెంట్లలో పనిచేసే సిబ్బంది ఉపాధి దెబ్బతింటుంది. ఇక స్విగ్గి, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. ఇక హోస్టల్స్ కూడా బంద్ అయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులు, ఉద్యోగులు కూడా భయపడుతున్నారు. ఒకవేళ యుద్దం ముగిసినా గ్యాస్ నిల్వలు విదేశాల నుంచి భారత్కు వచ్చేందుకు కొన్ని రోజుల సమయం పడుతుంది. దీంతో గ్యాస్ కొరత కొద్ది నెలల పాటు కొనసాగే అవకశముందని చెబుతున్నారు. కొన్ని నెలల పాటు గ్యాస్ వినియోగదారులు ఇబ్బందులు పడక తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
పర్యాటక రంగానికి తీవ్ర నష్టం
హోటల్స్ అన్నీ మూతపడనుండటంతో పర్యాటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. వీటిపై ఆధారపడి జీవనం సాగించేవారి ఉపాధి దెబ్బతిననుంది. ఇక అనేక రంగాలు దీని వల్ల కుదేలు కానున్నాయి. దీంతో గ్యాస్ సంక్షోభంపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. దేశంలో ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంపెనీలు గ్యాస్ ఉత్పత్తిని పెంచే పనిలో స్పీడ్ పెంచాయి. ఇప్పటికే వ్యాపార, పారిశ్రామిక అవసరాల కోసం గ్యాస్ సరఫరా చేయవద్దని ఆదేశించిన కేంద్రం.. కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే డెలివరీ చేయాలని ఆదేశించింది. గ్యాస్ కొరత పెరిగే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు ముందుగానే గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకుని రెడీగా ఉంచుకుంటన్నారు.
