AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ 24 బంతులే మ్యాచ్‌ను శాసించాయి.. హిట్‌మ్యాన్‌కు ఇచ్చిపడేసిన ధోని.. సాక్ష్యం ఇదిగో.!

“మనం ఎక్కడ ఓడిపోయామో తెలుసా?”.. ధోని సినిమాలోని ఈ డైలాగ్ నిన్న ముంబై-చెన్నై మ్యాచ్‌కు ఆచ్చొస్తుంది. అసలు ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎక్కడ ఓడిపోయింది. చివరి వరకు దూకుడైన ఆటతీరు ప్రదర్శించిన ఎంఐ..

ఆ 24 బంతులే మ్యాచ్‌ను శాసించాయి.. హిట్‌మ్యాన్‌కు ఇచ్చిపడేసిన ధోని.. సాక్ష్యం ఇదిగో.!
Mumbai Indians Vs Chennai S
Ravi Kiran
|

Updated on: Apr 15, 2024 | 12:46 PM

Share

“మనం ఎక్కడ ఓడిపోయామో తెలుసా?”.. ధోని సినిమాలోని ఈ డైలాగ్ నిన్న ముంబై-చెన్నై మ్యాచ్‌కు ఆచ్చొస్తుంది. అసలు ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎక్కడ ఓడిపోయింది. చివరి వరకు దూకుడైన ఆటతీరు ప్రదర్శించిన ఎంఐ.. ఏ టైంలో గేర్ నెమ్మదించింది. నిన్నటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో, ధోని 4 బంతుల్లో 3 వరుస సిక్సర్లతో 20 పరుగులు సాధించి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడగా.. ఇక ఆ పరుగులే ముంబై ఓటమికి కారణమయ్యాయి. మరోవైపు చెన్నై యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరనా అద్భుతమైన స్పెల్‌తో 4 వికెట్లు పడగొట్టి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చిరస్మరణీయ సెంచరీ సాధించినప్పటికీ.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

చెన్నై నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఛేదించలేక 20 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ వంటి హిట్టర్లు ఉన్నప్పటికీ.. ముంబై గేమ్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. హిట్‌మ్యాన్ తప్ప.. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. చెన్నై విజయంలో ధోని 3 సిక్సర్లు, పతిరానా 4 వికెట్లు కీలకంగా మారాయి. అసలు ఆ 24 బంతుల్లోనే కథంతా మారింది.. రోహిత్ శర్మ, తిలక్ వర్మ వేగంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వారిద్దరిని కట్టడి చేసి.. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

తర్వాతి ఓవర్‌లో అనగా.. 14వ ఓవర్‌లో వచ్చిన పతిరానా 6 పరుగులిచ్చి తిలక్ వర్మను పెవిలియన్‌కు పంపాడు. ఇక ఆ నెక్స్ట్ శార్దూల్ ఠాకూర్ 15వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలకు 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 16వ ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే కూడా పొదుపుగా బౌలింగ్ చేసి.. హార్దిక్ వికెట్ తీయడంతో పాటు కేవలం 3 పరుగులకే ఇచ్చాడు. దీంతో ఈ 4 ఓవర్లలో ముంబై 17 పరుగులు మాత్రమే చేసి 2 కీలక వికెట్లు కోల్పోయింది. 12వ ఓవర్‌ వరకు 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన ముంబై.. 16వ ఓవర్‌ ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ 4 ఓవర్లలోనే ముంబై మ్యాచ్‌పై పట్టును పూర్తిగా కోల్పోయిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.