AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇదేం ఫీల్డింగ్ సామీ.. 5 ఇన్సింగ్స్.. 13 క్యాచ్‌లు మిస్.. ఇట్లా అయితే ఎట్లా..

భారత ఆటగాళ్లు చేసిన తప్పే పదే పదే చేస్తున్నారు. గత రెండు మ్యాచుల్లో భారీగా క్యాచ్‌లు వదిలేశారు. ఫస్ట్ టెస్టులో క్యాచ్‌లు మిస్ చేయడం వల్లే భారత్ ఓడిపోయింది. అయితే మూడో టెస్టుకు సెట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఎటువంటి మార్పు రాలేదు.

IND vs ENG: ఇదేం ఫీల్డింగ్ సామీ.. 5 ఇన్సింగ్స్.. 13 క్యాచ్‌లు మిస్.. ఇట్లా అయితే ఎట్లా..
Team India
Krishna S
|

Updated on: Jul 11, 2025 | 7:25 PM

Share

ఒక్క క్యాచ్.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. మ్యాచ్ గెలిపించడంతో పాటు ఓడించే సత్తా క్యాచ్‌లకు ఉంది. క్రికెట్‌లో క్యాచ్‌లు ఎంత ముఖ్యమో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. 1983 వరల్డ్ కప్‌లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్‌ను ఎవరూ మరచిపోరు. ఇది టీమిండియాకు తొలి ప్రపంచ కప్‌ను తెచ్చిపెట్టింది. అదే సమయంలో క్యాచ్‌లను వదిలేయడం వల్ల మ్యాచ్‌లను ఓడిపోయిన సందర్భాలను చూశాం. ఇటువంటి స్థితిలో.. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఆటగాళ్ళు చేతులకు ఆయిల్ రాసుకుని ఫీల్డింగ్ చేస్తున్నారా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మూడో టెస్టులోనూ పలు క్యాచ్‌లను భారత ఆటగాళ్లు మిస్ చేశారు. ఇప్పటివరకు జరిగిన ఇన్నింగ్స్‌లను కలుపుకుంటే 13 క్యాచ్‌లను వదిలేశారు. అందులో ఒకటి లేదా రెండు తప్ప.. మిగిలినవి ఈజీగా పట్టాల్సిన క్యాచ్‌లే. ఇటువంటి మిస్ ఫీల్డింగ్ ఘటనలే మ్యాచ్ ఓటమికి కారణమవుతాయి.

ఫస్ట్ టెస్ట్‌లో 8 క్యాచ్‌లు..

ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్లు దంచికొట్టారు. ఏకంగా ఈ టెస్టులో ఐదు సెంచరీలు సాధించారు. అయినా మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీనికి కారణం క్యాచులు మిస్ చేయడమే. బౌలింగ్‌లో బుమ్రా తప్ప మిగిలిన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే.. పేలవమైన ఫీల్డింగ్‌ వల్లే ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిందని చెప్పొచ్చు. మొదటి టెస్ట్‌లో టీమిండియా మొత్తం 8క్యాచ్‌ల వరకు వదిలేసింది. ఈ లైఫ్‌లైన్‌లను అందుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ఆ టెస్టులో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక రెండవ టెస్టులో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. తక్కువ క్యాచ్‌లు వదిలేయడం. ఈ టెస్ట్‌లో భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లను వదిలేశారు. కానీ టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా రాణించడంతో ఈ టెస్టులో భారత్ గెలిచింది.

ఇప్పుడు రెండు క్యాచ్‌లు..

రెండు టెస్టుల తర్వాత మూడో మ్యాచ్‌లోనైనా టీమిండియా ప్లేయర్స్ సెట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం మూడో టెస్ట్ జరుగుతుండగా.. మొదటి రెండు రోజుల్లో భారత్ విలువైన రెండు క్యాచ్‌లను వదిలేసింది. మొదటి రోజు కెప్టెన్ గిల్.. ఓలీ పోప్ క్యాచ్‌ను మిస్ చేశాడు. ఈ లైఫ్‌లైన్‌ను సద్వినియోగం చేసుకున్న పోప్.. రూట్‌తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండవ రోజు ఆటలో స్లిప్‌లో నిలబడి ఉన్న రాహుల్.. జామీ స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. రాహుల్ క్యాచ్‌ను వదిలినప్పుడు సింగిల్ డిజిట్‌లో ఉన్న స్మిత్.. ఆ తర్వాత హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ వదిలిపెట్టిన క్యాచ్ ఎంత విలువైనదో ఆ ఇన్నింగ్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా భారత ఆటగాళ్లు.. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌పై గట్టి ఫోకస్ పెట్టాలని.. లేకపోతే మ్యాచ్‌లు గెలవడం కష్టమవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..