Rythu Bharosa: రైతులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఆరోజే అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు
రాష్ట్రంలో రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అన్నదాతలకు అండగా నిలించేందుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా మొదటి విడత నిధులను విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయాలని నిర్ణయించింది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. రైతులకు ఆర్థిక సహాయం త్వరగా అందేలా విడతల వారీగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటి విడతలో సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,590 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఒక ఎకరం వరకు ఉన్న రైతులకు ఈ విడతలో రైతు భరోసా నిధులు అందనున్నాయి. నిధులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత విడుదలైన 20 రోజుల తర్వాత రెండో విడత నిధులను విడుదల చేయనున్నారు. ఈ దశలో సుమారు రూ.2,650 కోట్లను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
అలాగే ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులను కూడా విడుదల చేసి ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడు విడతల్లో కలిపి దాదాపు రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులు రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
