AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ మొదలవ్వకముందే వికెట్ డౌన్.. ఢిల్లీ జట్టును వీడిన ఇంగ్లాండ్ దిగ్గజం

IPL 2026 : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ కెవిన్ పీటర్సన్ తప్పుకున్నారు. సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఐపీఎల్ వేదికగా ఎదిగి, గతంలో ఢిల్లీ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన పీటర్సన్, జట్టును వీడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

IPL 2026 : ఐపీఎల్ మొదలవ్వకముందే వికెట్ డౌన్.. ఢిల్లీ జట్టును వీడిన ఇంగ్లాండ్ దిగ్గజం
Kevin Pietersen
Rakesh
|

Updated on: Mar 14, 2026 | 6:50 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి మొదలవ్వకముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. టోర్నీ ప్రారంభానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండగా, ఆ జట్టు మెంటార్‌గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ దిగ్గజ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్‌లో తాను ఢిల్లీ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ వేదికగా ఎదిగి, గతంలో ఢిల్లీ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన పీటర్సన్, జట్టును వీడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పీటర్సన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆయన హిందీలో పోస్ట్ చేయడం విశేషం. మెంటార్ బాధ్యతలకు కేటాయించాల్సిన సమయం ప్రస్తుతం తన వద్ద లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఐపీఎల్ ప్రేమికులకు ఆయన ఒక తీపి కబురు కూడా చెప్పారు. మెంటార్‌గా జట్టు పక్కన ఉండకపోయినా, కామెంట్రీ బాక్స్‌లో కూర్చుని తన గొంతుతో అభిమానులను అలరిస్తానని పీటర్సన్ హామీ ఇచ్చారు.

“ఈ సీజన్‌లో నేను ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా ఉండలేను. ఈ పనికి కావాల్సిన సమయాన్ని నేను కేటాయించలేకపోతున్నాను. ఆటగాళ్లందరికీ ఆల్ ది బెస్ట్. అయితే మిమ్మల్ని కామెంట్రీ బాక్స్‌లో కలుస్తాను. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్. మిమ్మల్ని త్వరలోనే చూడాలని ఉంది” అంటూ పీటర్సన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. గత సీజన్‌లో పీటర్సన్ మెంటార్‌గా ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన పర్వాలేదనిపించింది. సీజన్ ప్రారంభంలో అదరగొట్టినా, చివర్లో తడబడటంతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ప్లేఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయి ఐదో స్థానంలో నిలిచింది.

ఐపీఎల్ ప్రారంభానికి కేవలం 14 రోజుల ముందు ఇలాంటి కీలక వ్యక్తి దూరం కావడం ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని పట్టుదలతో ఉంది. ఇప్పుడు పీటర్సన్ స్థానంలో కొత్త మెంటార్‌ను తీసుకుంటారా లేక ఉన్న కోచింగ్ స్టాఫ్‌తోనే ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా పీటర్సన్ మెరుపు విశ్లేషణలు కామెంట్రీ బాక్స్ నుంచే వినాల్సి రావడం ఢిల్లీ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us