Delhi Capitals : నిన్న పులి.. నేడు పిల్లి.. ఢిల్లీ క్యాపిటల్స్కు ఘోర పరాభవం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
Delhi Capitals : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత అవమానకరమైన రికార్డును మూటగట్టుకుంది. ఆర్సీబీపై పవర్ప్లేలో కేవలం 13 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది.

Delhi Capitals : క్రికెట్లో రికార్డులు క్రియేట్ చేయడం ఎంత కష్టమో.. అవమానకరమైన రికార్డులు మూటగట్టుకోవడం అంతకంటే వేగంగా జరిగిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. శనివారం జరిగిన మ్యాచ్లో 264 పరుగులు చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అదే ఢిల్లీ టీమ్.. సోమవారం నాటి మ్యాచ్లో మాత్రం 75 పరుగులకే కుప్పకూలి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
అసలేం జరిగిందంటే?
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు. తొలి ఓవర్ రెండో బంతికే భువనేశ్వర్ కుమార్ వికెట్ల వేట మొదలుపెట్టగా.. ఆ తర్వాత వరుసగా కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, నితీష్ రాణా ఒకరి వెనుక ఒకరు అవుట్ అయ్యారు. కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కోలుకోలేని దెబ్బతిన్నది.
చరిత్రలో అత్యంత తక్కువ పవర్ప్లే స్కోరు
ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో పవర్ప్లేలో (తొలి 6 ఓవర్లలో) ఇంత దారుణమైన స్కోరు ఏ టీమ్ చేయలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది. గతంలో 2009లో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 14/2 స్కోరు చేయగా, 2022లో రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ 14/3 స్కోరు చేసింది. ఇప్పుడు ఈ రెండు జట్ల కంటే చెత్త రికార్డును ఢిల్లీ నమోదు చేసింది.
ఒక్క మ్యాచ్తో అంతా తలకిందులు
కేవలం రెండు రోజుల క్రితమే 264 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ, సోమవారం మాత్రం 75 పరుగులకే కుప్పకూలడం అభిమానులను షాక్కు గురిచేసింది. పవర్ప్లే ముగిసే సమయానికి సగం కంటే ఎక్కువ టీమ్ పెవిలియన్లో కూర్చోవడం ఐపీఎల్ చరిత్రలోనే ఒక బ్లాక్ మార్క్ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్వుడ్ తమ స్పెల్స్తో ఢిల్లీ వెన్నుముక విరిచారు.
ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ బ్యాటర్లు ఇలాగే బాధ్యత లేకుండా ఆడితే మాత్రం ఈ సీజన్ ఢిల్లీకి చేదు జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
