IPL 2026: ఫ్రాంచైజీలకు ఇచ్చిపడేసిన బీసీసీఐ.. ఇకపై ఆ పప్పులుడకవంతే..!
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల సునామీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి మ్యాచ్లోనూ 220కి పైగా స్కోర్లు సర్వసాధారణం కావడంతో అసలు సొంత మైదానంలో ఆడుతున్నామనే ప్రయోజనం జట్లకు కలగడం లేదు. బీసీసీఐ కఠిన నిబంధనలు, పిచ్ తయారీలో ఫ్రాంచైజీల జోక్యం తగ్గడం వల్ల బౌలర్లు నిస్సహాయులుగా మారుతున్నారు.

ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో బ్యాటర్ల ఆధిపత్యం పెరగడానికి ప్రధాన కారణం పిచ్లే. గతంలో ఫ్రాంచైజీలు తమ బలాబలాలకు అనుగుణంగా స్థానిక క్యూరేటర్లపై ఒత్తిడి తెచ్చి పిచ్లను రూపొందించుకునేవి. కానీ ఈసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠినమైన మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ప్రతి వేదిక వద్ద బోర్డుకు చెందిన కేంద్ర క్యూరేటర్లు పర్యవేక్షిస్తుండటంతో, స్థానిక జట్లకు అనుకూలంగా ఉండే ‘హోమ్ అడ్వాంటేజ్’ పూర్తిగా కనుమరుగైంది.
బౌలర్లకు చుక్కలు.. బ్యాటర్లకు పండగ..
పిచ్లపై పచ్చికను సమానంగా ఉంచడం, స్పిన్నర్లకు లేదా సీమర్లకు అదనపు సహాయం అందకుండా చూడాలని బోర్డు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సరిహద్దుల దూరం కూడా గరిష్టంగా 77 మీటర్లకే పరిమితం కావడంతో, బంతి బ్యాటుకు తగిలితే చాలు సిక్సర్లుగా మారుతున్నాయి. ఢిల్లీ వంటి మైదానాల్లో సైతం భారీ స్కోర్లు నమోదవుతుండటంపై కోచ్లు పెదవి విరుస్తున్నారు. బౌలర్లకు ఎటువంటి సహకారం లేకపోవడంతో మ్యాచ్లు ఏకపక్షంగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్రాంచైజీల ఆందోళన..
సొంత మైదానాల్లో ఆడుతున్నప్పుడు తమ జట్టులోని స్పిన్ లేదా పేస్ బలాన్ని వాడుకునే అవకాశం లేకపోవడంపై ఫ్రాంచైజీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఒకే రకమైన పిచ్లు ఉండటం వల్ల పర్యాటక జట్లకు అది వరంగా మారుతోంది. బ్యాటర్లు కూడా ఫ్లాట్ పిచ్లపై అలవాటు పడిపోయి, కొంచెం కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కుప్పకూలుతున్నారు. లీగ్ చివరి దశకు చేరుకునే కొద్దీ ఎండల తీవ్రత పెరిగి పిచ్లు నెమ్మదించే అవకాశం ఉన్నప్పటికీ, అప్పటివరకు బౌలర్లకు ఈ పరుగుల వేట తప్పేలా లేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
