గిల్ జోడికి మొండిచేయి.. ఓపెనర్లుగా కోహ్లీ, వైభవ్.. ఈ ప్లేయింగ్ 11 చూస్తే సుస్సుపోసుకోవడం పక్కా..!
IPL 2026 Team of The Tournament: ఈ సీజన్ ప్రదర్శనల ఆధారంగా ఎంపిక చేసిన ఈ జట్టు అత్యంత సమతుల్యంగా కనిపిస్తోంది. కొందరు స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కకపోయినప్పటికీ, యువ రక్తం, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఈ జట్టు నిజంగానే మైదానంలో తిరుగులేని శక్తిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

IPL 2026 Team of The Tournament: ఐపీఎల్ 2026 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సంచలన విజయంతో ముగిసిన వేళ, ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన ప్రత్యేక జట్టును ప్రముఖ క్రీడా విశ్లేషణ సంస్థ ‘ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో’ ప్రకటించింది. అయితే ఈ జట్టులో లీగ్ అంతటా పరుగుల వరద పారించిన కొందరు దిగ్గజాలకు చోటు దక్కకపోవడం, యువ ఆటగాళ్లకు పట్టం కట్టడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
గుజరాత్ ఓపెనర్లకు దక్కని చోటు.. కోహ్లీ, వైభవ్లకే అగ్రతాంబూలం!
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టును ఫైనల్ వరకు చేర్చడంలో ఆ జట్టు ప్రారంభ ఆటగాళ్లు శుభ్మన్ గిల్ (732 పరుగులు), సాయి సుదర్శన్ (722 పరుగులు) అద్భుతమైన భాగస్వామ్యాలతో రాణించారు. లీగ్లోనే అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా పేరు తెచ్చుకున్నప్పటికీ, వీరికి ఈ విశ్లేషణాత్మక జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. వీరి స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, ఆరెంజ్ క్యాప్ విజేత వైభవ్ సూర్యవంశీ (776 పరుగులు), ఆర్సీబీ రథసారథి విరాట్ కోహ్లీ (675 పరుగులు)లను ఓపెనర్లుగా ఎంపిక చేశారు.
మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్.. సారథిగా రజత్ పాటిదార్!
మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు చోటు దక్కింది. అతను ఈ సీజన్లో మెరుపు వేగంతో 602 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్కే చెందిన హెన్రిచ్ క్లాసెన్ (624 పరుగులు) నిలిచాడు. ఇక ఈ జట్టుకు నాయకుడిగా ఆర్సీబీని వరుసగా రెండోసారి విజేతగా నిలిపిన అత్యంత విజయవంతమైన కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎంపిక చేశారు. అతను జట్టును నడిపించిన తీరుకు ఈ గౌరవం దక్కింది.
ఆల్రౌండర్లుగా తెలుగు తేజం నితీష్, కృణాల్ పాండ్యా..
సన్రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతంగా రాణించిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ జట్టులో ఆల్రౌండర్గా స్థానం సంపాదించాడు. అతను బ్యాటింగ్లో 302 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 8 వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు ఆర్సీబీ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా (226 పరుగులు, 14 వికెట్లు) జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్పిన్ విభాగంలో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ కేవలం 6.6 పొదుపు రేటుతో 15 వికెట్లు తీసి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
నిప్పులు చెరిగిన బౌలర్లు.. రబాడకు లభించిన పర్పుల్ క్యాప్ గౌరవం
ఈ అత్యుత్తమ జట్టులో పేస్ బౌలింగ్ విభాగం ఎంతో బలంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో ఏకంగా 29 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతనితో పాటు ఆర్సీబీ తరపున సంచలన బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు) జట్టులోకి వచ్చారు. చివరిగా హైదరాబాద్ వేగవంతమైన బౌలర్ సాకిబ్ హుస్సేన్కు కూడా ఈ తుది జట్టులో అవకాశం దక్కింది. అయితే 19 వికెట్లు తీసిన ఆర్సీబీ బౌలర్ రాసిఖ్ సలామ్కు నిరాశే ఎదురైంది.
ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో ప్రకటించిన ఐపీఎల్ 2026 ఉత్తమ జట్టు: వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, రజత్ పాటిదార్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, కృణాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, కగిసో రబాడ, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ హుస్సేన్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




