IND vs ZIM: సొంత టీంమేట్లకే హ్యాండివ్వనున్న కెప్టెన్ సాబ్.. సిరీస్ మొత్తం ఈ ముగ్గురు బెంచ్కే..!
India vs Zimbabwe T20I: సారథిగా తనపై ఉన్న ఒత్తిడిని అధిగమించి, జింబాబ్వేపై ఎలాగైనా విజయభేరి మోగించాలనే పట్టుదలతో శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఆటగాళ్ల ఫామ్, అనుభవం, పిచ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అత్యుత్తమ కలయికను మైదానంలోకి దించేందుకు టీమిండియా సిద్ధమవుతోంది.

India vs Zimbabwe T20I: ఇటీవలి ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో ఘోర పరాజయాల తర్వాత, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత టీ20 జట్టు జులై 23 నుంచి జింబాబ్వేతో మూడు మ్యాచ్ల సిరీస్కు సమాయత్తమవుతోంది. కెప్టెన్గా తొలి సిరీస్ విజయం కోసం అయ్యర్ ఆరాటపడుతున్న నేపథ్యంలో, అత్యుత్తమ తుది జట్టును బరిలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కీలక ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది.
శ్రేయస్ అయ్యర్ బెంచ్ కే పరిమితం చేసే ఆటగాళ్లు వీరే..!
యూకే పర్యటనలో చవిచూసిన పరాభవం తర్వాత, టీమిండియా మేనేజ్మెంట్ ఏమాత్రం ప్రయోగాలకు తావులేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున మెరిసిన ఇద్దరు కీలక ఆటగాళ్లతో పాటు మరొక స్టార్ బౌలర్ ఈ సిరీస్ పొడవునా బెంచ్ కే పరిమితమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
1. ప్రభ్సిమ్రన్ సింగ్ (PBKS స్టార్ ఓపెనర్)..
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున 510 పరుగులు చేసి సంచలన ఫామ్ కనబరిచిన ప్రభ్సిమ్రన్ సింగ్ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయినప్పటికీ, జింబాబ్వే టీ20ల్లో ఆయన తుది జట్టులో చోటు దక్కించుకోవడం అనుమానమే.
కారణం: అభిషేక్ శర్మకు జోడీగా భారత జట్టు యాజమాన్యం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో సూర్యవంశీ ప్రతిభను నిరూపించుకోవడానికి అతనికి మూడు మ్యాచ్ల్లోనూ అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. దానికితోడు వికెట్ కీపర్ పాత్రను ఇషాన్ కిషన్ పోషించడం దాదాపు ఖాయం కావడంతో ప్రభ్సిమ్రన్ బెంచ్కే పరిమితం కావాల్సి రావచ్చు.
2. సూర్యాంశ్ షెడ్గే (ఆల్రౌండర్)..
ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తో ఆకట్టుకున్న సూర్యాంశ్ షెడ్గే, ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లలో ఘోరంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం 8 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు.
పోటీ: మిడిలార్డర్లో రింకూ సింగ్ పునరాగమనం చేస్తుండగా, అనుభవజ్ఞుడైన శివమ్ దూబే మొదటి ప్రాధాన్య ఆల్రౌండర్గా ఉండే అవకాశం ఉంది.
పిచ్ వాతావరణం పొడిగా ఉంటే హర్ష్ దూబే వైపు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ సమీకరణాల దృష్ట్యా శ్రేయస్ అయ్యర్ తుది జట్టు ఎంపికలో సూర్యాంశ్ను పక్కనబెట్టక తప్పదు.
ఇదికూడా చదవండి: ఆల్రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల
3. మయాంక్ యాదవ్ (ఫాస్ట్ బౌలర్)..
తన వేగంతో వార్తల్లో నిలిచిన మయాంక్ యాదవ్, తరచూ గాయాల బారిన పడుతుండటం ఆయన కెరీర్కు ప్రతిబంధకంగా మారింది. ఐపీఎల్ 2026లో నాలుగు మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా 11.38 ఎకానమీతో నిరాశపరిచాడు.
పోటీగా ఉన్న బౌలర్లు: తుది జట్టు రేసులో ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ ఆయన కంటే ఎంతో ముందున్నారు.
ప్రిన్స్ యాదవ్ పేస్ రథసారధిగా వ్యవహరిస్తుండగా, డెత్ ఓవర్లలో యశ్ ఠాకూర్ వైవిధ్యం, అశోక్ శర్మ ఫిట్నెస్ జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నాయి. దీంతో మయాంక్ యాదవ్ను భారత స్క్వాడ్కు ఎంపిక చేసినప్పటికీ, తుది 11 మందిలో చోటు దక్కడం కష్టమే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




