IND vs ENG Test Match: ఈ నెల18 నుంచి ఉప్పల్ టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు షురూ.. టికెట్స్ ధరలు ఇవే!
ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జనవరి 18వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. టికెట్ల అమ్మకాలపై హెచ్సీఏ కార్యవర్గ సభ్యులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన వివరాలు తెలియజేశారు. 18వ తేదీ నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్లో టిక్కెట్లను ఆన్లైన్లో..

ఉప్పల్, జనవరి 14: ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జనవరి 18వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు. టికెట్ల అమ్మకాలపై హెచ్సీఏ కార్యవర్గ సభ్యులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన వివరాలు తెలియజేశారు. 18వ తేదీ నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్లో టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయించనున్నామన్నారు. మిగిలన టిక్కెట్లను 22వ తేదీ నుంచి ఆన్లైన్లో పాటు జింఖానాలోని హెచ్సీఏ స్టేడియంలో ఆఫ్లైన్లో కూడా అమ్మనున్నామని ప్రకటించారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు 22వ తేదీ నుంచి ఏదైనా తమ ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి, టిక్కెట్లను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
రిపబ్లిక్ డే రోజున వారికి ఫ్రీ ఎంట్రీ
తెలంగాణ కేంద్రంగా దేశం కోసం అహర్నిశలు తమ రక్తం ధారబోస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందిని రిపబ్లిక్ డే రోజున (26వ తేదీ) మ్యాచ్ చూసేందుకు ఉచితంగా అనుమతించనున్నామని చెప్పారు. తెలంగాణలో పని చేస్తున్న భారత సాయుధ బలగాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) సిబ్బందికి వారి కుటుంబాలతో కలిసి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఆసక్తి గల వారు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖ, కుటుంబ సభ్యుల వివరాలను ఈనెల 18వ తేదీ లోపు హెచ్సీఏ సీఈఓకి ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
300లకు పైగా స్కూల్స్ నుంచి అర్జీలు
స్కూల్ విద్యార్థులకు రోజుకు ఐదు వేలు చొప్పున మొత్తం 5 రోజులకు గానూ 25 వేల కాంప్లిమెంటరీ పాసులు కేటాయించామన్నారు. ఈ 25 వేల మందికి ఉచితంగా భోజనం, తాగునీరు అందించనున్నామని తెలిపారు. విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని ప్రకటించనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 300లకు పైగా పాఠశాలల నుంచి అర్జీలు వచ్చాయని, వారితో తమ సిబ్బంది ప్రత్యుత్తరాలు నడుపుతున్నారని జగన్మోహన్ రావు చెప్పారు. స్కూల్స్ తమ విద్యార్థుల పేరు, క్లాస్ సహా పూర్తి వివరాలను పంపించాలన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫామ్స్లో ఐడీ కార్డ్స్ వెంట తీసుకొని రావాలని, స్టేడియంలోకి ప్రవేశించాక విద్యార్థుల బాధ్యత సంబంధిత పాఠశాల సిబ్బందిదేనని చెప్పారు.
టిక్కెట్ల ధరలు
టెస్టు మ్యాచ్ టిక్కెట్ ప్రారంభ ధర కనిష్ఠంగా రూ.200 కాగా, గరిష్ఠంగా రూ.4 వేలుగా నిర్ణయించామని జగన్మోహన్ రావు చెప్పారు. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని, అందరికి అందుబాటులో ఉండేలాగా ధరలను నిర్ణయించామన్నారు. టిక్కెట్ల ధరలు రూ. 200, రూ. 499, రూ. 1000, రూ. 1250 వరకు ఉన్నాయి. ఉతర్త దిక్కు కార్పొరేట్ బాక్సులు విత్ హాస్పిటాలటీ రూ.3 వేలు, దక్షిణ దిక్కు కార్పొరేట్ బాక్సులు విత్ హాస్పిటాలటీ రూ.4 వేలు ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి.




