IND vs BAN: ఇంకా సిరీస్కు రెండు వారాలే.. అయినా షెడ్యూల్ రాలేదు.. టీమిండియా బంగ్లా టూర్పై ఉత్కంఠ
IND vs BAN: వచ్చే నెలలో జరగాల్సిన టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. సెప్టెంబర్ 3 నుంచి ఆరంభం కావాల్సిన ఈ కీలక సిరీస్కు సంబంధించి బిసిసిఐ ఇంకా అధికారిక షెడ్యూల్ విడుదల చేయకపోవడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తేదీలు మారే అవకాశం ఉందంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ప్రకటించింది.

IND vs BAN: భారత క్రికెట్ జట్టు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ టూర్ ప్లానింగ్ విషయంలో ఇరు దేశాల బోర్డులు తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారంగా 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్ల సిరీస్ కోసం భారత జట్టు అక్కడికి వెళ్లాల్సి ఉంది. నిజానికి ఈ పర్యటన ఆగస్టు 2025లోనే జరగాల్సి ఉండగా దాన్ని సెప్టెంబర్ 2026కి వాయిదా వేశారు. ఈ ఏడాది జనవరిలో బిసిబి ప్రకటన చేస్తూ ధాకా, చిట్టగాంగ్లలో ఈ మ్యాచ్లు జరుగుతాయని వెల్లడించింది. సిరీస్ ప్రారంభానికి కేవలం రెండు వారాల సమయం కూడా లేకపోవడంతో షెడ్యూల్ను రీడిజైన్ చేసే పనిలో ఇరు బోర్డులు నిమగ్నమయ్యాయి.
మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చిన తమీమ్ ఇక్బాల్
ధాకాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీబీ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ మాట్లాడారు. భారత్తో జరగాల్సిన సిరీస్ విషయమై బీసీసీఐతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. మ్యాచ్ల తేదీల్లో స్వల్పంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. కొత్త విండోను కనుగొనడం ద్వారా రెండు జట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చూస్తున్నట్లు వివరించారు. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు.
అంతర్గత టోర్నీలతో తేదీల తగాదా
ఇదే సమయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ సొంత డొమెస్టిక్ టోర్నమెంట్ గేమ్ డెవలప్మెంట్ ట్రోఫీ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ టోర్నీని ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 9 వరకు మీర్పూర్ లోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో నిర్వహించనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా సిరీస్ కూడా ఉండే అవకాశం ఉండటంతో వేదికల సమస్య తలెత్తింది. ఈ విషయంపై తమీమ్ స్పందిస్తూ, అవసరమైతే డొమెస్టిక్ టోర్నీని రెండు నిమిషాల్లో వేరే గ్రౌండ్కు షిఫ్ట్ చేస్తామని చెప్పారు. భారత్ సిరీస్ షెడ్యూల్ ఖరారైన వెంటనే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని తేల్చి చెప్పారు.
బోర్డుల మధ్య నెలకున్న పాత ఉద్రిక్తతలు
ఐపిఎల్ సమయంలో కొల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ వేగవంతమైన బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను హఠాత్తుగా వెనక్కి పిలిపించిన ఘటన తర్వాత రెండు బోర్డుల మధ్య వాతావరణం కాస్త వేడెక్కింది. ఆ వివాదం తగ్గక ముందే ఇప్పుడు తక్కువ సమయంలో కొత్త తేదీలను ఖరారు చేయడం రెండు క్రికెట్ బోర్డులకు పెద్ద సవాలుగా మారింది. తేదీల రీషెడ్యూల్ వార్తలతో క్రికెట్ వర్గాల్లో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
