AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: వాటితో మాకేం సంబంధం! ఐపీఎల్‌ టిక్కెట్ల వివాదంలో క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ!

ఐపీఎల్ 2025 హైదరాబాద్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలపై తలెత్తిన వివాదంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఛైర్మన్ అర్శనపల్లి జగన్మోహన్ రావు స్పష్టతనిచ్చారు. తక్కువ ధర టిక్కెట్లను హెచ్‌సీఏ కావాలనే హోల్డ్ చేసి, టిక్కెట్ల దందాకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. టిక్కెట్ల అమ్మకంలో హెచ్‌సీఏ పాత్ర లేదని, సన్‌రైజర్స్ హైదరాబాద్, బుక్‌మైషో ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. తప్పుడు ప్రచారాలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

IPL 2025: వాటితో మాకేం సంబంధం! ఐపీఎల్‌ టిక్కెట్ల వివాదంలో క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ!
Hca Chairman Jagan Mohan Ra
SN Pasha
|

Updated on: Mar 09, 2025 | 7:03 AM

Share

ఐపీఎల్‌ 2025కు సంబంధించి హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ టిక్కెట్లను బ్లాక్‌ చేసి పెట్టారని, సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉంటే తక్కువ ధర కలిగిన టిక్కెట్లు ఎలా క్షణాల్లో అమ్ముడైపోతాయంటూ విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ(హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌) కావాలనే తక్కువ ధర ఉన్న టిక్కెట్లను హోల్డ్‌ చేసి, వాటిని బ్లాక్‌లో అమ్ముకోవాలని చూస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో ఒక్కసారిగా అంతా హెచ్‌సీఏపై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో అసలు ఆ టిక్కెట్ల అమ్మకంతో హెచ్‌సీఏకు సంబంధమే లేదంటూ హెచ్‌సీఏ ఛైర్మన్‌ అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వివరణ ఇచ్చారు. హెచ్‌సీఏపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఎంతో చరిత్ర కలిగిన హెచ్‌సీఏ ప్రతిష్ట దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. టిక్కెట్ల విషయంలో చెలరేగిన వివాదం నేపథ్యంలో ఆయన శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు. “ముంబైలో జ‌రిగే మ్యాచ్‌కు టిక్కెట్లు సోల్డ్ అవుట్ అయితే హెచ్‌సీఏకు ఏం సంబంధం? హైద‌రాబాద్ మ్యాచ్ టిక్కెట్లను విక్రయించేంది బుక్‌మై షోలో కాదు డిస్ట్రిక్ జొమాటో యాప్‌లో. తొలి రెండు మ్యాచ్‌ల టిక్కెట్లు ఇప్పటికీ డిస్ట్రిక్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. మిడిమిడి జ్ఞానం, స‌మాచారంతో వార్తలు ప్రచారం చేసి క్రికెట్‌ అభిమానులను గంద‌ర‌గోళంకు గురి చేయ‌వ‌ద్దు. ఐపీఎల్ మ్యాచ్ టిక్కెట్లపై నియంత్రణ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ది కానీ హెచ్‌సీఏది కాదు. బీసీసీఐ, హెచ్‌సీఏ ఐపీఎల్ ఏర్పాట్లను మాత్రమే ప‌రిశీలిస్తుంది. మ్యాచ్‌ టిక్కెట్లు విక్రయించదు.

ఉద్దేశపూర్వకంగా హెచ్‌సీఏ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదు. దేశంలోనే హెచ్‌సీఏను ఒక రోల్ మోడ‌ల్‌గా నిల‌బెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఐపీఎల్ టిక్కెట్ల దందా అని హెచ్‌సీఏపై త‌ప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఛానెల్స్‌కు లీగ‌ల్ నోటీసులిస్తాం. కొంద‌రిచ్చే త‌ప్పుడు స‌మాచారంతో హెచ్‌సీఏపై బుర‌ద‌చల్లితే న్యాయ‌ప‌రంగా చర్యలు తీసుకొంటాం. టీటీడీ విడుద‌ల చేసే రూ.300ల టిక్కెట్లు వెంట‌నే అయిపోతే ఇలానే విమర్శిస్తారా? త‌క్కువ ధ‌ర టిక్కెట్లను విద్యార్థులు, యువ‌త‌లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబ‌ట్టి అవి త్వరగా అమ్ముడైపోతాయి. చివ‌ర‌గా టిక్కెట్ల విష‌య‌మై ఏమైనా అనుమానులుంటే స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం, సిబ్బంది, డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ ప్రతినిధులు సంప్రదించండి.” అంటూ పేర్కొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us