IPL 2026: ఒక్క రోజులో రూ. 22.4 కోట్ల విలువైన ముగ్గురు ప్లేయర్లు ఔట్.. ఎందుకంటే..?
IPL 2026 Injuries: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ ప్రారంభానికి ముందే ఫ్రాంచైజీలకు గట్టి షాక్లు తగులుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీకి దూరమవ్వడం సంచలనం సృష్టిస్తోంది. 22.4 కోట్ల రూపాయల విలువైన ఈ ఆటగాళ్లు దూరం కావడంతో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.

IPL 2026 Injuries: మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కావాల్సి ఉండగా, 9 రోజుల ముందే జట్లలో అలజడి మొదలైంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తమ స్టార్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ సేవలను కోల్పోగా, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా తొలి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదు. అయితే, తాజాగా ముగ్గురు ఆటగాళ్లు ఏకంగా సీజన్ మొత్తానికి దూరం కావడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్కు షాక్: నాథన్ ఎల్లిస్ దూరం..
గురువారం మార్చి 19న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పేసర్ నాథన్ ఎల్లిస్ హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సీజన్ ఆడటం లేదని వార్తలు వచ్చాయి. దీనిపై సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ, ఎల్లిస్ గాయం తీవ్రత దృష్ట్యా అతను కోలుకోవడానికి సమయం పడుతుందని, అందుకే ఈ సీజన్కు అందుబాటులో ఉండటం లేదని ధృవీకరించారు. గత సీజన్లో కీలక పాత్ర పోషించిన ఎల్లిస్ దూరం కావడం చెన్నై బౌలింగ్పై ప్రభావం చూపనుంది.
రాజస్థాన్ రాయల్స్కు సామ్ కరణ్ షాక్..
మరోవైపు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ కూడా గాయంతో ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 2.4 కోట్లకు ట్రేడ్ ద్వారా దక్కించుకుంది. అయితే గ్రోయిన్ ఇంజూరీ (Groin Injury) కారణంగా అతను మైదానంలోకి అడుగుపెట్టలేకపోతున్నాడు. ఆల్ రౌండర్ కోటాలో కీలకమైన కరణ్ లేకపోవడం రాజస్థాన్కు పెద్ద మైనస్ కానుంది.
కేకేఆర్ ఆశలపై నీళ్లు చల్లిన మతీషా పతిరాణా..
అన్నిటికంటే పెద్ద దెబ్బ కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కి తగిలింది. వేలంలో ఏకంగా రూ. 18 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన శ్రీలంక పేసర్ మతీషా పతిరాణాకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ (SLC) నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) నిరాకరించింది. ఫిట్నెస్ టెస్టులో పతిరాణా విఫలం కావడమే దీనికి కారణం. టీ20 వరల్డ్ కప్ సమయంలో తగిలిన గాయం ఇంకా తగ్గకపోవడంతో అతను ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు ఆటగాళ్లకు ‘చెన్నై’ కనెక్షన్!
ఈ ముగ్గురు ఆటగాళ్ల విషయంలో ఒక ఆసక్తికరమైన పోలిక ఉంది. వీరంతా గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో సంబంధం ఉన్నవారే. సామ్ కరణ్, పతిరాణా గత ఏడాది చెన్నై జట్టులో ఉండగా, పతిరాణాను కేకేఆర్ భారీ ధరతో కొనుగోలు చేసింది. ఎల్లిస్ మాత్రం ఈ ఏడాది కూడా చెన్నై స్క్వాడ్లో భాగంగా ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఈ ముగ్గురు పాత స్నేహితులు ఇప్పుడు గాయంతో ఇంటికే పరిమితమయ్యారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
