India tour of England: కోహ్లీ సేనకు బిగ్ న్యూస్..! ఆంక్షలపై సడలింపులు ఇచ్చిన బ్రిటీష్ సర్కార్..
India tour of England: టీమిండియాకు గుడ్ న్యూస్... బీసీసీఐ వేసిన ప్లాన్ ఫలించింది. టీమ్ఇండియాకు కఠిన క్వారంటైన్ నుంచి బ్రిటిష్ ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ప్రయాణ ఆంక్షలను రద్దు చేసింది.

భారత్ దేశంలో కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతుండటంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై బ్రిటన్ ఆంక్షలు విధించింది. సొంత దేశం, ఐర్లాండ్ పౌరులు మినహా మరెవ్వరినీ రానివ్వడం లేదు. ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమిండియా మూడు నెలలు అక్కడే ఉండాల్సి ఉంటుంది. మహిళల జట్టు కూడా ఒక టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసుల కోసం అక్కడికి వెళ్తోంది. అయితే బీసీసీఐ బ్రిటన్ సర్కార్తో చర్చలు జరిపింది. అనంతరం సడలింపులు సాధించింది. టీమిండియా జూన్ 2న బ్రిటన్కు బయల్దేరనుంది. మూడో తేదీ నుంచి భారత బృందం సౌథాంప్టన్లో కఠిన క్వారంటైన్లో ఉండనుంది.
జూన్18న న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఆడనుంది. ఆ తర్వాత నెలరోజులు సాధన మ్యాచులు ఆడి ఇంగ్లాండ్తో సుదీర్ఘ ఫార్మాట్లో తలపడుతుంది. బుధవారం లోపు టీమిండియా సభ్యులంతా ముంబైకి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా మే 24న బయో బబుల్లోకి వెళ్లిపోతారు. ముంబైలో ఉండే క్రికెటర్లు 24న నేరుగా బుడగలోకి ప్రవేశించొచ్చు. మిగతా నగరాల నుంచి వచ్చే వారి కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేసింది.
అయితే.. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై నుంచి ఛార్టర్ విమానాలు ఏర్పాటు చేసింది. బెంగళూరులోని క్రికెటర్లు చెన్నై నుంచి రావాల్సి ఉంటుంది. కోల్కతా ఆటగాళ్లు బిజినెస్ ఫ్లైట్లో ముంబైకి చేరుకుంటారు. గుజరాత్ క్రికటర్లకూ కూడా ఇంతే. సుదీర్ఘ పర్యటన, కఠినమైన బయో బుడగ కాబట్టి కుటుంబ సభ్యులకూ కూడా వీరితోపాటే ఉండేందుకు అవకాశం ఇస్తున్నారు. క్రికెటర్లతో పాటు వారూ ముంబైలో కఠిన కట్టుబాట్లలో ఉండాల్సి ఉంటుంది. క్రికెటర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షల నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వగా కుటుంబ సభ్యుల కోసమూ బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఎవరైనా సరే ముంబయిలో పాజిటివ్ వస్తే మాత్రం ఇంగ్లాండ్కు ప్రయాణం లేనట్టే!