BCCI: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం.. సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ

టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓడిపోవడం కంటే ఓడిపోయిన తీరు విషయంలో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీనియర్‌ ఆటగాళ్లను తప్పించి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు.

BCCI: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యం.. సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ
Team India
Follow us

|

Updated on: Nov 19, 2022 | 7:15 AM

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంతో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ పురుషుల క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించింది. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఓడిపోవడం కంటే ఓడిపోయిన తీరు విషయంలో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీనియర్‌ ఆటగాళ్లను తప్పించి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు సూచించారు. మరోవైపు ప్రపంచకప్‌కు జట్టును సరిగా ఎంపిక చేయకపోవడం కూడా టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణమని కొందరు భావించారు. ఇందులో భాగంగానే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని బీసీసీఐ రద్దు చేసింది. అలాగే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

కాగా ప్రస్తుత సెలెక్షన్‌ కమిటీలో ఛైర్మన్‌గా చేతన్‌ శర్మ ఉండగా.. సునీల్‌ జోషి(సౌత్‌ జోన్‌), హర్విందర్‌ సింగ్‌(సెంట్రల్‌ జోన్‌), దెబాషిశ్‌ మొహంతి(ఈస్ట్‌ జోన్‌) లు ఉన్నారు. ఈ సెలక్షన్ కమిటీ హయాంలో టీమ్ ఇండియా వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు ఆడింది. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సూపర్-12 రౌండ్‌లోనే నిష్క్రమించింది. తాజా ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లో ఇంటి బాట బట్టింది. ఈ నేపథ్యంలోనే సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇందులో భాగంగా కొత్త సెలెక్షన్‌ కమిటీకి దరఖాస్తులు సమర్పించేందుకు నవంబర్‌ 28 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చింది. అలాగే దరఖాస్తుదారులకు ఎలాంటి అర్హతలు ఉండాలో కూడా అందులో పేర్కొంది. సెలక్షన్‌ కమిటీలోని ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు లేదా 10 వన్డేలు లేదా 20 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ సూచించింది. అలాగే, క్రికెట్‌కు కనీసం 5 ఏళ్ల క్రితం రిటైర్మెంట్‌ ప్రకటించి ఉండాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..