AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మీ అభిమానం సల్లగుండా! కోట్లు ఇచ్చిన కొనలేని ప్రేమ హిట్ మ్యాన్ సొంతం

ఐపీఎల్ 2025లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆకాష్ మాధ్వాల్ తన పూర్వ జట్టు ముంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ, రితికా సజ్దేకు ఆకాష్ చేతులు జోడించి నమస్కరించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే మ్యాచ్‌లో రోహిత్ 6000 పరుగుల మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించాడు. తన పూర్వపు ఫామ్ తిరిగి పొందుతూ, ముంబయి విజయంలో కీలకపాత్ర వహించాడు.

Video: మీ అభిమానం సల్లగుండా! కోట్లు ఇచ్చిన కొనలేని ప్రేమ హిట్ మ్యాన్ సొంతం
Rohit Sharma Mi
Narsimha
|

Updated on: May 02, 2025 | 1:39 PM

Share

ఐపీఎల్ 2025లో గురువారం జరిగిన మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ (RR) పేసర్ ఆకాష్ మాధ్వాల్, ముంబయి ఇండియన్స్ (MI) స్టార్ రోహిత్ శర్మ, ఆయన భార్య రితికా సజ్దేకు చేతులు జోడించి నమస్కరించిన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మ్యాచ్‌లో MI 100 పరుగుల తేడాతో RRపై ఘన విజయం సాధించి తాత్కాలికంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 2023 సీజన్‌లో రోహిత్ నేతృత్వంలో ఆకాష్ మాధ్వాల్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయడమే కాదు మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే, 2024లో ఎక్కువ అవకాశాలు దక్కకపోవడంతో MI అతన్ని విడుదల చేసింది. తరువాత, 2025 మెగా వేలంలో RR అతన్ని రూ.1.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది.

ఈ సీజన్‌లో RR తరఫున మాధ్వాల్ తొలి మ్యాచ్ గురువారమే ఆడాడు. తన పూర్వ జట్టుపై వికెట్ తీసేకపోయినా, పోస్ట్-మ్యాచ్ సమయంలో రోహిత్‌తో చిన్న చర్చ జరిపాడు. ఆ సమయంలో రోహిత్ స్టాండ్స్‌లో ఉన్న తన భార్య రితికా వైపు చూపించాడు. దాంతో మాధ్వాల్ ఆమెకు కూడా చేతులు జోడించి నమస్కరించాడు. రితికా కూడా నవ్వుతూ అతనికి అభివాదం తెలిపింది. ఆ తర్వాత రోహిత్, మాధ్వాల్ జెర్సీపై సంతకం చేసి మధుర అనుభూతులను బహుమతిగా ఇచ్చాడు.

జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్, ముంబయి ఇండియన్స్ తరఫున 6000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఒక్క జట్టుకే ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన మొత్తం పరుగులు 6024 కాగా, మొదటి స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 8871 పరుగులతో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 36 బంతుల్లో 53 పరుగులు చేసి, తొమ్మిది ఫోర్లతో మెరిశాడు. ఇది ఈ ఐపీఎల్‌లో ఆయనకు మూడవ అర్ధ సెంచరీ.

ఐపీఎల్ 2025 తొలి భాగంలో మొదటి ఐదు ఇన్నింగ్స్‌లో కేవలం 56 పరుగులు చేసిన రోహిత్, గత ఐదు ఇన్నింగ్స్‌లో రెండు నాటౌట్ అర్ధ సెంచరీలతో సహా 234 పరుగులు చేసి తన ఫామ్‌ను తిరిగి పొందాడు. RRపై 53 పరుగులతో తన ఫామ్‌ను కొనసాగిస్తున్న రోహిత్, ముంబయి ఇండియన్స్‌కు కీలక దశలో మళ్లీ బలంగా మారాడు.

ఇక మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్‌ల హాఫ్ సెంచరీలతో జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత, సూర్య కుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అజేయంగా తలో 48 పరుగులు చేసి జట్టు స్కోరును 217 పరుగులకు తీసుకెళ్లారు. ఛేదనలో రాజస్థాన్ జట్టు 117 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. దీని కారణంగా రాజస్థాన్ భారీ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.