AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadagiri Gutta: రేపటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం..

11 రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు.. రేపు స్వస్తి వచనంతో మొదలయ్యే విష్వక్సేనుడి ఆరాధనతో ఊపందుకుంటాయి. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, దివ్యవిమాన రథోత్సవం, చక్రతీర్థ స్నానం ప్రధానమైనవి. బ్రహ్మోత్సవాల్లో 18న రాత్రి శ్రీస్వామి, అమ్మవారల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ ఉత్తర ముఖంగా ఉన్న మాడవీధిలో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి అందజేస్తారు.

Yadagiri Gutta: రేపటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం..
Yadagirigutta Brahmotsavam
M Revan Reddy
| Edited By: |

Updated on: Mar 10, 2024 | 10:10 AM

Share

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 11రోజుల పాటు జరగనున్నాయి. మహాదివ్య పుణ్యక్షేత్రమైన యాదాద్రి పంచనారసింహుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో మరో తిరుమల క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రీశుల వైభవం నలుదిశల్లోని భక్తజనులను అలరింపజేసేలా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు రంగం సిద్ధం చేశారు. క్షేత్రాభివృద్ధిలో భాగంగా ఆలయ ఉద్ఘాటన జరిగిన తర్వాత రెండోసారి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను అయిదు రోజులపాటు నిర్వహించనున్నారు.

యాదాద్రి క్షేత్రంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ విదియ మొదలు శుద్ధ ద్వాదశి వరకు సశాస్త్రీయంగా, లోకోత్తరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. నిత్య పూజలు, కైంకర్యాలకు తోడు వేదమంత్రాల ఘోషతో స్వామి వారి సన్నిధి మార్మోగుతుంది. పుష్పార్చనలు కొండగాలికి పరిమళం అద్దుతాయి. అలంకారాలు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన సేవలు అబ్బుర పరుస్తాయి. పాల్గుణ మాసం తొలిరోజు అంటే మార్చి 11న ఆలయ ఉత్సవాలు స్వస్తి వాచనం, విష్వక్సేన ఆరాధనతో ప్రారంభమై.. ద్వాదశి రోజు మార్చి 21న గర్భాలయంలోని మూలవరులకు చేపట్టే సహస్ర కలశాభిషేకం మహాక్రతువుతో ముగుస్తాయి.

ఇవి కూడా చదవండి

బ్రహ్మోత్సవాల వివరాలు …

  1. 11వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, స్వస్తీ వాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణ
  2. 12న ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం
  3. 13న అలంకార, వాహన సేవలు ప్రారంభం. ఉదయం మత్స్య అలంకారం, సాయంత్రం శేష వాహనం సేవ
  4. 14న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ
  5. 15న ఉదయం మురళీ కృష్ణుడి అలంకారం, రాత్రి పొన్న వాహన సేవ
  6. 16న ఉదయం గోవర్థనగిరిధారి అలంకారం, రాత్రి సింహ వాహన సేవ
  7. 17న ఉదయం జగన్మోహిన అలంకారం, రాత్రి స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం
  8. 18న శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై శ్రీస్వామివారి ఊరేగింపు.రాత్రి గజవాహన, శ్రీస్వామి, అమ్మవార్ల తిరు కల్యాణం నిర్వహిస్తారు.
  9. 19న ఉదయం శ్రీమహావిష్ణు అలంకార సేవ, గరుఢ వాహనంసేవ, రాత్రి దివ్య విమాన రథోత్సవం.
  10. 20న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థ స్నానం, దోపు ఉత్సవాలు
  11. 21న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.

18న స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణోత్సవం..

11 రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు.. రేపు స్వస్తి వచనంతో మొదలయ్యే విష్వక్సేనుడి ఆరాధనతో ఊపందుకుంటాయి. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, దివ్యవిమాన రథోత్సవం, చక్రతీర్థ స్నానం ప్రధానమైనవి. బ్రహ్మోత్సవాల్లో 18న రాత్రి శ్రీస్వామి, అమ్మవారల తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ ఉత్తర ముఖంగా ఉన్న మాడవీధిలో జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వస్త్రాలు, తలంబ్రాలను స్వామివారికి అందజేస్తారు. నరసింహుడు గజవాహనంపై మంటపానికి ఊరేగి రాగా, పూల పల్లకీలో అమ్మవారు తరలి వస్తారు. సముద్ర దేవుడే స్వయంగా వచ్చి నరకేసరి పాదాలు కడిగి అమ్మవారిని ఆయనకు అప్పగించాడన్న అనుభూతికి లోనై ఈ సందర్భాన్ని భక్తులు తిలకించి తరిస్తారు. మాంగల్య ధారణ, తలంబ్రాల ఉత్సవం జరిగినంత సేపూ కల్యాణ మంటపం గోవింద నామస్మరణతో మార్మోగుతుంది.

బ్రహ్మోత్సవాల్లో సేవలు రద్దు..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో రేపటి నుండి 21వ తేదీ వరకు శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు అన్ని రకాల అభిషేకాలు, అర్చనలు ఆర్జిత సేవలను రద్దు చేశారు. 18వ తేదీన శ్రీ స్వామి, అమ్మవారి తిరు కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు రూ.3వేల టికెట్‌ కొనుగోలు చేసి సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనాలని ఆలయ అధికారులు తెలిపారు.

రేపు యాదగిరిగుట్టకు అఖండ జ్యోతి యాత్ర..

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లోని బర్కత్‌పుర నుంచి మార్చి 8న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అఖండ జ్యోతి యాత్ర ప్రారంభమైంది. అఖండ జ్యోతి యాత్ర యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల ప్రచారం నిర్వహిస్తూ వార్షిక ఉత్సవాల అంకురార్పణ రోజు రేపు యాదగిరిగుట్టకు చేరుకుంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..