Govinda Koti: భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్.. గోవింద కోటి రాసేవారికి వీఐపీ బ్రేక్ దర్శనం.. కండిషన్స్ అప్లై
తిరుమల తిరుపతిలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. అందుకనే తిరుమలను ఇల వైకుంఠంగా భావిస్తారు. ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోవాలని కోరుకుంటారు. అది కూడా శ్రీవారిని దగ్గరగా చూడడం అంటే జీవితంలో అదొక ఆధ్యాత్మిక సౌరభంగా భావిస్తారు. ఈ నేపధ్యంలో భక్తుల కు శ్రీవారి దర్శనం మరింత సులభతరం చేస్తూ టీటీడీ వారు సరికొత్త ఆలోచన చేసింది.

నేటి యువతని సనాతన ధర్మంవైపు నడిపించడానికి, ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త ఆలోచనతో భక్తుల ముందుకు వచ్చింది. రామ కోటి తరహాలో గోవింద కోటి రాసే భక్తులకు వారి కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిని బ్రేక్ దర్శనం చేసుకునే వీలుని కల్పిస్తోంది. అయితే గత ఏడాది ఏప్రిల్ లో గోవిందకోటి నామాల పుస్తకాన్ని కర్ణాటకకు చెందిన కీర్తన పూర్తి చేసింది. బెంగళూరులో ఇంటర్ చదివిన కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి టీటీడీకి ఆ పుస్తకాలను సమర్పించింది. దీంతో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. ఆనంతరం కీర్తన తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంది. తర్వాత మరో ఇద్దరు భక్తులు గోవింద కోటి నామాలు రాసి కోనేటి రాయుడిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు చెప్పారు. వాస్తవానికి ఈ గోవింద కోటిని రెండేళ్ళ క్రితమే టీటీడీ ప్రవేశ పెట్టింది.. అయితే దీని గురించి భక్తులకు పెద్దగా తెలియలేదు.
గోవింద కోటిని ఎలా రాయాలంటే
కొండల్లో వెలసిన కోనేటిరాయుడిని బ్రేక్ దర్శనం చేసుకోవాలని కోరుకునే భక్తులు గోవింద కోటి రాయాలి. గోవింద నామాన్ని రాసే భక్తుల కోసం టీటీడీ కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టింది. ఈ గోవింద కోటి ఎలా రాయాలి? ఈ పుస్తకాలను ఎక్కడ తీసుకోవాలి సూచించింది. గోవింద కోటి పుస్తకం రాసే భక్తులకు 25 ఏళ్లు, లేదా అంతకంటే తక్కువ వయసు ఉండాలి.
25 ఏళ్ళు తక్కువ వయసున్న భక్తులు మాత్రమే ఈ గోవింద కోటి రాసేందుకు అర్హులు. 10,01,115 సార్లు గోవింద కోటి రాయాలి. గోవింద కోటి పుస్తకాలు టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్లైన్లో మాత్రమే లభిస్తాయి. ఒకొక్క పుస్తకంలో రెండు వందల పేజీలు ఉంటాయి. ఒకొక్క పుస్తకంలో 39,600సార్లు గోవింద నామాలు రాయాల్సి ఉంటుంది. ఇలా 10,01,116 గోవిందకోటి నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు కావాల్సి ఉంటాయి.
మొత్తం గోవింద నామాలను రాసేందుకు మూడు సంవత్సరాలు పడుతుందని టీటీడీ అంచనా వేసింది. ఇలా గోవింద నామాలు పూర్తి చేసిన తర్వాత ఆ పుస్తకాలను తిరుమలలోని టీటీడీ పేష్కార్ ఆఫీసులో అందించాలి. అప్పుడు భక్తులకు మర్నాడు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే సౌకర్యం కల్పిస్తామని భక్తుడి తన కుటుంబ సభ్యులతో పాటు శ్రీవారిని దర్శించుకోవచ్చు అని పేష్కార్ రామకృష్ణ తెలిపారు.
మరి మీరు కూడా 25 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అయితే స్వామివారిని విఐపీ దర్శనం చేసుకోవాలనుకుంటే శ్రీవారి గోవింద కోటి నామాలు రాయడం మొదలు పెట్టండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..