AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు? అసలు నిజం ఇదేనా..?

Tirumala Garbhalayam bell: తిరుమల గర్భగుడిలో గంట లేకపోవడం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒక భక్తురాలికి గంటను ప్రసాదంగా ఇవ్వడం, ఆ గంట అంశతో వేదాంత దేశిక జన్మించడం ఈ రహస్యానికి మూలం. ఆయన బాల్యం నుండి అద్భుత శక్తులు, కవితాధారలతో వైష్ణవ సాంప్రదాయానికి గొప్ప సేవ చేశారు.

తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు? అసలు నిజం ఇదేనా..?
Tirumala Garbhalayam Bell
Rajashekher G
|

Updated on: Jul 18, 2026 | 1:22 PM

Share

భారతదేశంలోని అత్యంత ప్రాచీన, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గర్భాలయంలో చిన్న గంట ఉండదనే విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇతర ఆలయాల్లో గంటలు మ్రోగించడం సర్వసాధారణం కాగా, తిరుమల గర్భగుడిలో గంట లేకపోవడం వెనుక ఒక సుందరమైన, లోతైన ఆధ్యాత్మిక కథ దాగి ఉంది. ఈ కథ పురాణాలు, ఆగమ శాస్త్రాలు, సాంప్రదాయ విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పూర్వం ద్రోతాంబ, అనంత సూర్య అనే పతివ్రత దంపతులు సంతానం లేక దీర్ఘకాలం బాధపడ్డారు. వివాహమై పన్నెండు సంవత్సరాలు గడిచినా వారికి పిల్లలు కలగలేదు. సంతానం కోసం ఎన్నో నోములు నోచి, పూజలు చేశారు. వారి భక్తికి మెచ్చి, ఒకరోజు వారు తిరుమల శ్రీవారి ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో, వెంకటేశ్వర స్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చారు. స్వామి తన చేతిలో ఉన్న గంటను ద్రోతాంబకు ప్రసాదంగా ఇచ్చి, దానిని మింగమని ఆదేశించారు. ఈ గంట అంశతో (దైవిక శక్తితో) వారికి ఒక మహనీయుడు కుమారుడిగా జన్మిస్తాడని స్వామి ఆశీర్వదించారు. ద్రోతాంబ నిద్రలేచి తన భర్త అనంత సూర్యకు ఈ స్వప్నం గురించి చెప్పగా, ఆశ్చర్యకరంగా ఆయనకు కూడా అదే రకమైన స్వప్నం వచ్చిందని తెలిపారు.

మరుసటి రోజు ఉదయం ఆలయంలోని ప్రధాన గంట కనిపించకపోవడంతో అర్చకులు కలవరపడ్డారు. ఈ దంపతులే గంటను దొంగలించారని పొరబడ్డారు. అయితే, వెంకటేశ్వర స్వామి అర్చకులకు ధ్యానంలో కనిపించి, గంటను తానే ద్రోతాంబకు ఇచ్చానని, ఆ గంట అంశతో ఒక గొప్ప మహనీయుడు వారికి జన్మిస్తాడని స్పష్టం చేశారు. ఈ దైవిక ఆదేశం కారణంగా, తిరుమల గర్భాలయంలో ఈనాటికీ చిన్న గంట ఉండదు. స్వామికి పూజలు, నివేదనలు జరుగుతున్నప్పుడు గర్భగుడి బయట ఉన్న గంటమండపంలోని పెద్ద గంటలను మోగిస్తారు. స్వామి చెప్పినట్టుగానే, ద్రోతాంబ, అనంత సూర్య దంపతులకు వేదాంత దేశిక అనే అద్భుతమైన పిల్లవాడు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆయన అపారమైన జ్ఞానాన్ని, మేధస్సును ప్రదర్శించారు. ఒకసారి ఒక ప్రవచనంలో, ప్రవచనం చెప్పే గురువు బాల దేశిక తేజస్సును చూసి పక్కన కూర్చోబెట్టుకొని మిఠాయిలు ఇచ్చారు. ఆ గురువు ఆపిన చోటు నుంచి దేశిక తమిళంలో ప్రవచనాన్ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయనే రామానుజుల వారి తర్వాత వైష్ణవ సాంప్రదాయాన్ని నిలబెడతాడని పండితులు గుర్తించారు.

యువకుడైన దేశికకు వారి మేనమామ గరుడ మంత్రాన్ని ఉపదేశించి, తమిళనాడులోని తిరువాహీంద్రపురంలోని కొండపై దీక్షతో జపించమని ఆదేశించారు. దేశిక కఠోర దీక్షతో మంత్రాన్ని జపించగా, గరుత్మంతుడు ప్రత్యక్షమై, ఆయనకు హయగ్రీవ మంత్రాన్ని, హయగ్రీవ స్వామి విగ్రహాన్ని ప్రసాదించారు. దేశిక ఆ మంత్రాన్ని పఠించగా, హయగ్రీవ స్వామి ప్రత్యక్షమై అనుగ్రహించారు. ఆ క్షణం నుంచి దేశికకు అద్భుతమైన కవితాధార అప్పొంగింది. తక్షణమే ఆయన హయగ్రీవ స్తుతి పేరుతో 32 శ్లోకాలు రచించారు. ఈ కారణంగా ఆయనకు కవితార్కిక కేసరి అనే బిరుదు లభించింది. వేదాంత దేశిక ఎవరి వద్ద నుంచి డబ్బు తీసుకోకుండా భిక్షాటనతో జీవించారు. ఆయన శత్రువులు ఒక బ్రాహ్మణుడిని పంపి బంగారు నాణేలు అడిగితే, దేశిక ఆకాశం వైపు చూసి శ్రీ స్తుతి పఠించగానే లక్ష్మీదేవి కనకధారను కురిపించిందని ప్రతీతి. ఆయన స్వరతంత్ర శ్వాసంత్ర అని కూడా పిలువబడ్డారు. శత్రువులు ఆయన్ను హేళన చేయడానికి ఒక తాపీ మేస్త్రీగా పంపితే, దేశిక హయగ్రీవ స్వామిని స్మరించి వెన్నెల గోడను నిర్మించారు. ఇప్పటికీ అక్కడ ఒక బావి కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒకసారి పండితులతో జరిగిన పోటీలో తెల్లవారేలోపు వెయ్యి శ్లోకాలు చెప్పాలని శత్రువులు ఆయనను ఆలయంలో బంధించారు. అప్పుడు దేశిక పాదుకా సహస్రం అనే వెయ్యి శ్లోకాలను తెల్లవారేలోపు రచించారు. పాదుకా సహస్రంలో వివాహం, సంతానం, కార్యసిద్ధి కోసం శ్లోకాలు ఉన్నాయని విశ్వాసం. మరోసారి శత్రువులు విషసర్పంతో కాటు వేయించబోతే, దేశిక గరుడ దండకం చదవగానే గరుడ పక్షి వచ్చి పామును పట్టుకుపోయిందని చెబుతారు. శత్రువుల వేధింపులతో ఆయన మైసూరు అడవులకు వెళ్ళారు. శ్రీరంగంలో మహమ్మదీయుల దండయాత్ర సమయంలో శవాల గుట్ట కింద దాక్కుని విష్ణుమూర్తి సాహిత్యాన్ని కాపాడారు. అక్కడ అభీతి స్తవం చెప్పారు. చివరకు శ్రీమన్నారాయణుడిలో ఐక్యమయ్యారు.

ఇది తిరుమల గర్భాలయంలో గంట లేకపోవడం వెనుక ఉన్న అద్భుతమైన చరిత్ర, వేదాంత దేశిక వారి దివ్యమైన జీవనగాథ. ఈ కథలు భక్తుల విశ్వాసాలు, సాంప్రదాయ కథనాలపై ఆధారపడినవి మాత్రమే.

మరి గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు?

తిరుమల ఆలయంలో గర్భగుడిలో ప్రత్యేకంగా వేలాడే గంట కనిపించదు. అయితే దీనికి సంబంధించి TTD ఎలాంటి అధికారిక కారణాన్ని ప్రకటించలేదు. ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతి ఆలయంలోని ఆచారాలు, నిర్మాణం, పూజా విధానాలు ఒకే విధంగా ఉండవు. ఏ దేవాలయం ఏ ఆగమాన్ని అనుసరిస్తుందో దాని ప్రకారమే పూజా విధానాలు, నిర్మాణ విశేషాలు మారుతూ ఉంటాయి. తిరుమల ఆలయంలోని పూజా సంప్రదాయాలు కూడా అత్యంత ప్రాచీనమైన వైఖానస ఆగమ సంప్రదాయాన్ని అనుసరిస్తాయి. అందువల్ల ఇతర ఆలయాలతో పోల్చి ప్రతి అంశానికీ ఒకే నియమం ఉంటుందని చెప్పలేం.

ఘంటా మండపం (Ghanta Mandapam)

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోని బంగారు వాకిలి (Bangaru Vakili) ముందు ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన మండపాల్లో ఘంటా మండపం లేదా మహామణి మండపం ఒకటి. పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడు, దేవగణాలు, సనక, సనందన, సనత్కుమారుల వంటి మహర్షులు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం బంగారు వాకిలి వద్ద వేచి ఉంటారని విశ్వసిస్తారు. బంగారు వాకిలికి ఎదురుగా గరుడ మండపం ఉంటుంది. ఈ రెండు మండపాలను అనుసంధానించే ప్రదేశాన్నే ఘంటా మండపం లేదా మహామణి మండపం అని పిలుస్తారు. ఈ మండపాన్ని క్రీ.శ. 1461లో విజయనగర సామ్రాజ్యానికి చెందిన మంత్రి, చంద్రగిరి వాసి మల్లన్న నిర్మించారు. ఇదే మండపంలో బంగారు వాకిలికి ఎదురుగా గరుడాళ్వార్ ఆలయం కూడా ఉంది.

ఘంటా మండపంలోని గంటల విశిష్టత

ఈ మండపంలో బంగారు వాకిలికి దక్షిణ వైపున ఒక చెక్క దిమ్మెకు ఇనుప గొలుసులతో రెండు భారీ గంటలు వేలాడదీసి ఉంటాయి. ఈ గంటలను మోగించే బ్రాహ్మణుడిని “ఘంటాపాణి” అని పిలుస్తారు. ఈ గంటలు మోగడం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామివారికి నైవేద్యం (భోజనం) సమర్పించే సమయం వచ్చిందని సూచిస్తారు.

విజయనగర రాజుల కాలం నాటి విశేషం

చారిత్రక ఆధారాల ప్రకారం, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి చంద్రగిరిలో శిబిరం వేసినప్పుడు, తిరుమలలో మోగించే ఈ గంటల శబ్దాన్ని మధ్యలో ఏర్పాటు చేసిన ఇతర గంటల మండపాల ద్వారా చంద్రగిరి వరకు వినిపించేలా ఏర్పాట్లు ఉండేవి. ఆ గంటల ధ్వని వినిపించిన తర్వాతే చక్రవర్తి తన భోజనం చేసేవారని చరిత్ర చెబుతోంది. ఈ విశిష్ట సంప్రదాయం కారణంగానే ఈ మండపానికి “ఘంటా మండపం” అనే పేరు వచ్చింది. ఈ సంప్రదాయానికి గుర్తుగా నేటికీ తిరుమలలో అనేక మంది భక్తులు ఘంటలు మోగి ఆగిన తర్వాతే భోజనం చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.

(Disclaimer: గర్భగుడిలో గంటకు సంబంధించిన కథ ఆధ్యాత్మికంగా వినడానికి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ఈ కథకు ప్రామాణిక ఆధారాలు లేవు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన గ్రంథాలు, వెంకటాచల మహాత్మ్యం, వరాహ పురాణం లేదా ఇతర ప్రామాణిక వైష్ణవ సంప్రదాయ గ్రంథాల్లో ఈ కథ ప్రస్తావన కనిపించదు. అలాగే శ్రీ వేదాంత దేశికుల జీవిత చరిత్రలో కూడా ఇలాంటి సంఘటన ఎక్కడా పేర్కొనబడలేదు. అందువల్ల దీనిని చారిత్రక సత్యంగా లేదా అధికారిక ఆలయ సంప్రదాయంగా చెప్పడం సరికాదు.)

Follow Us