ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా ? దాని విశిష్టత ఎంటంటే..

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనకు ప్రతిరూపంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి

ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా ? దాని విశిష్టత ఎంటంటే..
Follow us

|

Updated on: Feb 18, 2021 | 9:17 PM

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనకు ప్రతిరూపంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి పర్యవేక్షణలో వాస్తుశిల్పులు, స్థపతులు ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసిన కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రూపుదిద్దుకుంది.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి రెండులక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ఈ రాయిని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మవారిపాలెం నుంచి తీసుకువచ్చారు. ఈ రెండు జిల్లాల మధ్యన 20 కిలోమీటర్ల దూరంలోని భూమిలో ఈ రాయి లభించింది. 2016లో యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ పూజలు చేశారు. ఐదేళ్లలో ఈ ఆలయాన్ని శిల్పులు పూర్తిస్థాయిలో నిర్మించి భక్తులకు స్వయంభూ దర్శనాలు కల్పించే దిశగా పనులు పూర్తి కావచ్చాయి. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాన స్థపతితో పాటు పదకొండుమంది ఉపస్థపతులు, రెండువేల మంది శిల్పులు తొలి సంవత్సరం పని చేశారు. తరువాత సంవత్సరంలో పదిహేనువందల మంది శిల్పులు విధులు నిర్వహించారు. ఈ శిల్పుల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వారున్నారు. ప్రధానాలయ పునర్నిర్మాణం కోసం వైటీడీఏ రూ.200 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మతమైంది. ఇందుకు తగ్గట్టుగానే ఈ గుడిని విశిష్టంగా నిర్మించారు. అందులో ప్రత్యేకమైన కృష్ణశిలను అలాగే.. వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, అష్టభుజి ప్రాకార మండపాలను తీర్చిదిద్దారు. వంద సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా రాతి కట్టడాలతో యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు. పాత ఆలయం చుట్టూ సిమెంట్‌ కట్టడాలను విడతలు విడతలుగా చేపట్టారు. ప్రస్తుతం గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ పదునైన గోడను నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖ ద్వారాన్ని కూడా వెడల్పు చేశారు. గతంలో దేవాలయం చుట్టూ రథం, స్వామి వారి సేవ తిరగడానికి మూడు వైపుల్లో మాత్రమే స్థలం ఉండేది. దక్షిణం దిక్కున 120 అడుగుల రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి ఆలయానికి దక్షిణ భాగంలో స్థలం పెంచారు. గర్భాలయాన్ని మధ్యగా లెక్కిస్తూ పూర్తి అలయ నిర్మాణం చేపట్టారు. ముఖమండప స్థలం పెంచారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు ముప్పయి నుంచి నలభై వేల మంది వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. చుట్టూ ప్రాకార, అష్టభుజి మండపాలు నిర్మించారు. ప్రధానాలయంలో గతంలో ఉన్న విధంగానే ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ ఆలయం, ఆండాళ్‌ అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. ఇందులో అదనంగా సేనా మండపం, ఆళ్వార్, రామానుజుల ఉప ఆలయాలను నిర్మించారు. తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి భక్తులు వచ్చి, పడమటి రాజగోపురం నుంచి భక్తులు వెళ్లే మార్గంలో రాతి మెట్లకు రాతి రెయిలింగ్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

Also Read: Hindu Temple In Pakistan: పాకిస్తాన్ నడిబొడ్డున హిందూ దేవాలయం.. ఎట్టకేలకు అనుమతించిన ఆదేశ ప్రభుత్వం..