AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?

Sacred Origins of Lalita Sahasranama: తమిళనాడులో ఆధ్యాత్మిక కాంతిని విరజిమ్మే పవిత్ర క్షేత్రాల్లో ఒకటి తిరుమీయచూర్ లలితాంబిక ఆలయం. లలితా సహస్రనామ పారాయణాలతో నిత్యం మార్మోగే ఈ దేవస్థానాన్ని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరతాయని, అనారోగ్యాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ పరమేశ్వరుడు మేఘనాథ స్వామిగా, అమ్మవారు శ్రీ లలితాంబికా దేవిగా శ్రీచక్రంపై ఆసీనురాలై భక్తులకు కటాక్షం ప్రసాదిస్తారు.

లలితా సహస్రనామం పుట్టిన మహిమ గల క్షేత్రం ఎక్కడ ఉంది తెలుసా?
Glories Of Tirumeeyachur Ks
Rajashekher G
|

Updated on: Apr 26, 2026 | 3:01 PM

Share

Lalita Sahasranama: భారతదేశంలో ఆధ్యాత్మిక క్షేత్రాలు అనేకం ఉన్నాయి. అలాంటి పవిత్ర స్థలాల్లో ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ జిల్లాలో ఉన్న మేఘనాథస్వామి–లలితాంబిక ఆలయం. ఇక్కడ పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా, అమ్మవారు లలితాంబికగా పూజించబడతారు. మహాదేవుడు అమ్మవారిని శాంతపరిచిన స్థలంగా ఈ క్షేత్రానికి విశేష ప్రాధాన్యం ఉంది. లలితా పారాయణం, స్తోత్రాలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే ఇది దివ్యమైన శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

క్షేత్ర స్థానం

ఈ ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లా కేంద్రానికి సుమారు 25 కి.మీ దూరంలో ఉంది. చైత్ర మాసానికి సమానమైన తమిళ నెల ‘చితిరై’లో సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి స్వామి పాదాలను తాకడం ఒక అద్భుత దృశ్యం. ఈ ప్రత్యేకతను చూడటానికి ఏప్రిల్‌లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు.

సూర్య తేజస్సు.. చరిత్ర, విశిష్టత

చోళుల కాలానికి చెందిన ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల ప్రాచీనత కలిగి ఉంది. శైవ క్షేత్రం అయినప్పటికీ, ఇక్కడ లలితాంబికా దేవికి విశేష ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు ఇక్కడ తపస్సు చేసి తన తేజస్సును తిరిగి పొందాడనే స్థలపురాణం ప్రసిద్ధి.

అమ్మవారి రూప మహిమ

ఇక్కడ అమ్మవారిని సౌందర్య నాయకిగా ఆరాధిస్తారు. అలాగే ఎనిమిది చేతులతో ఉన్న దుర్గాదేవిని “శుక బ్రహ్మ దుర్గ”గా పూజిస్తారు. ఆమె చేతిలోని చిలుక శాంతి, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు.

ఆలయ ప్రాశస్త్యం

నాయనార్లలో ప్రముఖుడైన తిరుజ్ఞాన సంబంధర్ ఈ క్షేత్ర మహిమను తన పద్యాల్లో ప్రశంసించాడు. ఇక్కడ 60వ, 80వ శతాబ్దికోత్సవాలు (శష్టిపూర్తి, సతాభిషేకం) జరుపుకుంటే ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వాసం ఉంది.

లలితా సహస్రనామంతో సంబంధం

పురాణాల ప్రకారం, భండాసురుని సంహరించేందుకు యజ్ఞగుండం నుంచి శ్రీచక్రంపై లలితాంబికా దేవి అవతరించింది. తరువాత పరమశివుడి ఆజ్ఞతో ఆమె ఈ క్షేత్రంలో తపస్సు చేసి శాంత స్వరూపంగా వెలసింది. ఆ సమయంలో వశిన్యాది వాగ్దేవతలు మొదటిసారిగా “లలితా సహస్రనామం”ను ఇక్కడే పఠించారని చెబుతారు.

హయగ్రీవుడు – అగస్త్య మహర్షి కథ

విష్ణువు అవతారమైన హయగ్రీవుడు, అగస్త్య మహర్షికి లలితా సహస్రనామ రహస్యాలను ఇక్కడే ఉపదేశించాడని విశ్వాసం. అగస్త్యుడు తన భార్య లోపాముద్రతో కలిసి ఇక్కడ జపం చేయగా, అమ్మవారు ప్రత్యక్షమై వారికి అనుగ్రహం చేసినట్లు కథనం.

అన్నప్రసాదం మహిమ

ఈ క్షేత్రంలో సమర్పించే అన్నప్రసాదానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. స్వామి పాదాల ముందు ఉంచిన తర్వాత భక్తులకు ఇచ్చే ఈ ప్రసాదం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నమ్మకం.

శ్రీచక్ర స్తంభం ప్రత్యేకత

గర్భగుడి బయట ఎడమవైపున ఉన్న “శ్రీచక్ర స్తంభం” వద్ద కూర్చుని లలితా సహస్రనామం ఒక్కసారి జపిస్తే కోటి సార్లు జపించిన ఫలితం లభిస్తుందని విశ్వాసం ఉంది.

ఎలా చేరుకోవాలి?

సమీప రైల్వే స్టేషన్ పేరళం. చెన్నై–కరైకాల్ మార్గంలోని రైళ్లు ఇక్కడ ఆగుతాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

లలితా సహస్రనామ పారాయణం చేసే ప్రతి భక్తుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన పవిత్ర క్షేత్రం తిరుమీయచూర్. ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్యం, శుభఫలితాల కోసం ఈ ఆలయం ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us