Nagoba Jatara: నాగోబా జాతరలో నేడు కొత్త కోడళ్లు కొత్త పుట్టకు పూజలు.. ఈనెల 24 న గిరిజన దర్బార్

జాతరలో భాగంగా మూడవ రోజు.. పెర్సాపేన్, భాన్ దేవతలకు మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డోలు, పెప్రే, కాలీకోమ్ ఆదివాసీ వాయిద్యాలను వాయిస్తూ ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

Nagoba Jatara: నాగోబా జాతరలో నేడు కొత్త కోడళ్లు కొత్త పుట్టకు పూజలు.. ఈనెల 24 న గిరిజన దర్బార్
Nagoba Jatara
Follow us

|

Updated on: Jan 23, 2023 | 6:15 AM

వేలాదిగా తరలివచ్చిన అడవి బిడ్డలతో దట్టమైన అడవి జనసంద్రంగా మారింది. పెద్దఎత్తున వచ్చిన గిరిజనులతో కేస్లాపూర్‌ కిక్కిరిసిపోయింది. నాగోబా జాతరను మూడు రోజులుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఆదివాసీలు. ఇవాళ కొన్ని విశిష్టమైన పూజలు, కార్యక్రమాలు నిర్వహిస్తారు మెస్రం వంశీయులు. సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత.. ఆదివాసీల అతిపెద్ద పండగే.. ఈ నాగోబా జాతర. ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఈ జాతర నిర్వహిస్తారు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు.. స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జాతరలో భాగంగా మూడవ రోజు.. పెర్సాపేన్, భాన్ దేవతలకు మెస్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డోలు, పెప్రే, కాలీకోమ్ ఆదివాసీ వాయిద్యాలను వాయిస్తూ ఘనంగా పూజలు నిర్వహిస్తారు. కొత్తగా భేటింగ్ అయిన కొత్త కోడళ్లు మర్రిచెట్టు దగ్గర ఉన్న బావి నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి.. భాన్ దేవత ఆలయం ముందు ఉన్న పాత పుట్టను తొలగించి.. కొత్త పుట్టను తయారు‌చేసి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇచ్చోడ మండలం సిరికొండ నుంచి తెచ్చిన మట్టి కుండల్లో నవ ధాన్యాలు బెల్లం, పప్పు, పిండి, బియ్యంతో నైవేద్యాన్ని తయారు చేస్తారు. కుల దేవతలకు మొక్కి నైవేద్యాన్ని సమర్పిస్తారు.

ఇక ఈనెల 24 న నిర్వహించే గిరిజన దర్బార్.. నాగోబా జాతరలో మరో ప్రత్యేకం. ఈ దర్బార్‌కు మంత్రి సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు స్థానిక నేతలు, అధికారులు హాజరవుతారు. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు 1946 ఈ దర్బార్ ను కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మెస్రం వంశీయులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ నాగోబాను స్మరిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనేతరులు భారీగా తరలివచ్చారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి గిరిజనులు పెద్దఎత్తున వచ్చారు.

నిన్న నాగోబా జాతరకు కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. కేస్లాపూర్‌కి చేరుకున్న నేతలను సాదరంగా ఆహ్వానించారు గిరిజన పూజారులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి పంపితే ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు కేంద్ర మంత్రి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..