AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bakrid 2021: రేపటి ‘ఈదుల్ జుహా’కు అంతా సిద్ధం.. బక్రీద్ ప్రాశస్త్యం ఏంటి..? ఖుర్బానీ మూడు వాటలెందుకు వేస్తారు..?

త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. రేపటి ఈదుల్ జుహా వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలు..

Bakrid 2021: రేపటి 'ఈదుల్ జుహా'కు అంతా సిద్ధం.. బక్రీద్ ప్రాశస్త్యం ఏంటి..? ఖుర్బానీ మూడు వాటలెందుకు వేస్తారు..?
Bakrid 2021
Venkata Narayana
|

Updated on: Jul 20, 2021 | 3:46 PM

Share

Eid ul Adha 2021 : త్యాగానికి ప్రతీకగా ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకుంటారు. ప్రతి ఏటా ఈ పండుగను ఎంతో వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. రేపటి ఈదుల్ జుహా వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈద్గాలు, మసీదులు సుందరంగా అలంకరించారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ఈదుల్ జుహా అని కూడా అంటారు. బక్రీద్ రోజున ప్రార్ధనల ద్వారా జంతువులను బలి ఇవ్వడం ఆచారంగా వస్తోంది.

కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకునేందుకు ముస్లింలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏటా బక్రీద్ సందర్భంగా గొర్రెలు, మేకలకు భారీగా డిమాండ్ ఉండేది. ఆర్థిక స్థోమతకు అనుగుణంగా ముస్లింలు జంతువులను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా మేక పోతులు, గొర్రెల మందలే కనిపించడం పరిపాటి. అయితే, ఈసారి గొర్రెల అమ్మకాలు కరోనా లాక్ డౌన్లు, ప్రజల్లో కొనుగోలు శక్తి మందగించడం నేపథ్యంలో కొంత మేర తగ్గాయనే చెప్పాలి.

ఇక, బక్రీద్ పండుగ ప్రాశస్త్యంలోనికి వెళితే, రంజాన్ మాసం తర్వాత అటుఇటుగా రెండు నెలల తర్వాత బక్రీద్ వస్తుంది. ఈ పండుగ ముస్లింలకు రెండో అతి ముఖ్యమైన పండుగ. ఈ రోజును బక్రా ఈద్, బక్రీద్, ఈద్-అల్-అధా, ఈద్ ఖుర్బాన్ లేదా ఖర్బాన్ బయారమి అని కూడా ఆయా ప్రాంతాల్ని బట్టి పిలుస్తుంటారు. ఇస్లాంను అనుసరించే వారు బక్రీద్ పర్వదినానికి ప్రత్యేక స్థానమిస్తారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. భారత్‌లో ఈ పండుగ జులై 21 బుధవారం నాడు రానుంది. ముస్లిం సంస్థ ఉలేమా-ఈ-హింద్ ప్రకారం జులై 11న జుల్ హిజ్జాకు నెలవంక కనిపించింది. ఈ సంకేతం ప్రకారం భారత్ లో బక్రీద్ 2021 జులై 21న జరుగుతుంది. సౌదీ అరేబియాలో బక్రీద్ ను ఓ రోజు ముందు.. అంటే ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఇస్లామిక్, క్రైస్తవ, యూదు గ్రంథాల ప్రకారం తన ప్రియమైన వస్తువును త్యాగం చేయమని దేవుడు చెప్పినప్పుడు ప్రవక్త అబ్రహం తన కుమారుడు ఇస్మాయిల్ ను త్యాగం(బలి) చేయడానికి సిద్ధపడతాడు. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణత్యాగానికి బదులు ఓ జీవాన్ని బలివ్వాలని సూచిస్తారు. అప్పటి నుంచి బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇందుకోసం బలిచ్చిన జీవాన్ని మూడు భాగాలుగా చేసి ఓ భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు.

Read also:  ‘ఈటల నన్ను చంపించబోయారు.. బాల్‌రాజ్‌ను 2014లో హత్య చేయించారు.. ఆయనకు నరనరానా ఓసీ ఫీలింగ్ ఉంది’ : పాడి కౌశిక్ రెడ్డి