- Telugu News Photo Gallery World photos Most Beautiful architectural monuments in the world photos Telugu Travel Photos
Beautiful Monuments: ప్రపంచంలోని అత్యంత అందమైన ప్రసిద్ధ కట్టడాల గురించి తెలుసా..? అవి ఉండే ప్రదేశాలు
ప్రకృతి ప్రేమికులు, పర్యాటక లవర్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుత నిర్మాణాలను చూడటానికి ఎంతో తహతహలాడుతుంటారు. ముందుగానే ప్లాన్ వేసుకుని ప్రపంచాన్ని చుట్టి వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారి కోసమే.. ఇక్కడ..
Updated on: Nov 15, 2022 | 5:10 PM

లౌవ్రే పిరమిడ్, ఫ్రాన్స్: మీరు పారిస్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే,అక్కడ ఈఫిల్టవర్తో పాటు మీరు తప్పక చూడాల్సిన మరో అద్భుత నిర్మాణం అందుబాటులో ఉంది. ఇదే లౌవ్రే పిరమిడ్.. ఇది చైనీస్-అమెరికన్ ఆర్కిటెక్ట్ IM Pi రూపొందించిన ఈ పిరమిడ్ దాని నిర్మాణంతో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇది పూర్తిగా గాజుతో, మెటల్ తో నిర్మించబడింది. ఈ పెద్ద పిరమిడ్ చుట్టూ మూడు చిన్న పిరమిడ్లు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

మీరు ఇస్తాంబుల్ పర్యాటనకు వెళ్తున్నట్టయితే గనుక..టర్కీకి చెందిన హగియా సోఫియా, పక్కనే ఉన్న బ్లూ మసీదు తప్పక చూడవలసినవి. ఇస్తాంబుల్లోని బ్లూ మసీదు, దాని అధికారిక పేరు..కానీ, సుల్తాన్ అహ్మద్ మసీదు అని కూడా పిలుస్తారు. ఇది టర్కీలోని ఇస్తాంబుల్లోని చారిత్రాత్మక ఒట్టోమన్-యుగం సామ్రాజ్య కాలంనాటి మసీదు. ఇది పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. అహ్మద్ పాలనలో 1609-1616 మధ్య కాలంలో నిర్మించబడిందని చెబుతారు.

మీనాక్షి అమ్మవారి ఆలయం.. మీనాక్షి-సుందరేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని పురాతన, అత్యంత ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి. ఇది ఆశ్చర్యకరమైన ద్రావిడ శైలి నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. తమిళనాడులోని మదురై నగరంలో ఉన్న ఈ ఆలయం గొప్ప పౌరాణిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ఒక మతపరమైన కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని ద్రావిడ వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటి.

ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి తాజ్మహల్.. భారతదేశంలోని తాజ్ మహల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఉస్తాద్ అహ్మద్ లాహౌరీ మార్గదర్శకత్వంలో 20,000 మంది కళాకారులు పాలరాతితో ఈ అద్భుతమైన భవనాన్ని నిర్మించారు. ఇది ప్రేమకు చిహ్నంగా ప్రఖ్యాతిగాంచింది. చాలా మంది ప్రేమికులకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం.

సెయింట్ బాసిల్ కేథడ్రల్ 1555- 1561 మధ్య రష్యాలోని మాస్కోలో ఇవాన్ ది టెర్రిబుల్ చేత నిర్మించబడింది. ఇది రష్యా యొక్క అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక చిహ్నాలలో ఒకటి. ఇక్కడ అద్భుతమైన వాస్తుశిల్పం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు ఉంది. దేశంలోనే అతి పెద్ద మసీదు కావడంతో రోజువారీ ప్రార్థనలకు ఇది ప్రధాన ప్రార్థనా స్థలం. ఈ మసీదు 1994-2007 మధ్య నిర్మించబడింది. ఇది 60,570 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

న్యూష్వాన్స్టెయిన్ కాజిల్ అనేది జర్మనీలో ఉంది. జర్మన్ నైరుతి బవేరియాలోని ఫుసెన్ సమీపంలోని హోహెన్స్వాంగౌ గ్రామంలోని కొండపై ఉన్న 19వ శతాబ్దపు చారిత్రాత్మకమైన రాజభవనం. దీని నిర్మాణం 1869లో ప్రారంభమైంది. దీని రూపకల్పన బైజాంటైన్, అరబ్ నిర్మాణ అంశాలచే ఎక్కువగా ప్రభావితమైంది. ఇది ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

అజంతా, ఎల్లోరా గొప్ప శిల్పాలు భారతదేశం అద్భుతమైన శిల్పకళను సూచిస్తాయి. ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద రాతి శిల్పాలు. ఎల్లోరాలోని కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలాతో చెక్కబడింది. మహారాష్ట్రలోని అజంతా గుహలలో క్లిష్టమైన రాతి శిల్పాలతో కూడిన గుహ నిర్మాణాలు చూడవచ్చు. ఇవి క్రీ.పూ 2వ శతాబ్దంలో నిర్మింపబడినవి. ఇక్కడి శిల్పాలు బౌద్ధమతానికి సంబంధించినవి. ఈ అందమైన అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి.

డోమ్ ఆఫ్ ది రాక్.. జెరూసలేం ఈ ఆలయం దాని చక్కటి వాస్తుశిల్పంతో పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇది ఇస్లామిక్ పుణ్యక్షేత్రం, జెరూసలేం పాత నగరంలో అత్యంత ప్రసిద్ధ మైలురాయి. డోమ్ ఆఫ్ ది రాక్ కింద ఉన్న ఒక చిన్న గుహ జెరూసలేంలోని పవిత్ర ప్రదేశాలలో ఒకటి.





























