ఆ ఇన్సూరెన్సు 0.45 పైసలు మాత్రమే.. లాభాలు మాత్రం బోలెడు..
ఐఆర్సిటీసి పోర్టల్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకునే ఆప్షన్ ను పాసింజర్లకు రైల్వేలు అందిస్తున్నాయి. అయితే ఇది తప్పనిసరి మాత్రం కాదు. దీన్ని తీసుకోకుండా చాలామంది లైట్ తీసుకుంటారు. అయితే దీనితో ప్రయోజనాలు తెలిస్తే మాత్రం కచ్చితంగా తీసుకొంటారు. మరి IRCTC ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Nov 07, 2025 | 4:45 PM

భారతీయ రైల్వేలు అందిస్తున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ అత్యంత తక్కువ ఖర్చుతోనే అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్కో ప్రయాణికుడు కేవలం 0.45 పైసలు చెల్లించి ఇన్సూరెన్స్ పొందవచ్చు. అలా కవర్ కొనుగోలు చేసిన వారికి ఐదు రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

ప్రయాణ సమయంలో ప్రమాదంలో దెబ్బలు తగిలిన వ్యక్తి 12 నెలల్లో మరణిస్తే వారికి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. ఒకవేళ ప్రయాణ సమయంలో ప్రమాదం వల్ల 12 నెలల్లోపు శాశ్వతంగా పూర్తి వైకల్యం ఏర్పడితే వారికి ఇన్సూరెన్స్ పాలసీ కవర్ కింద 100 శాతం అంటే రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు.

ప్రయాణికుడు ప్రమాదం వల్ల 12 నెలల్లోపు శాశ్వత పాక్షిక వైకల్యానికి గురైతే పాలసీ కింద వారికి రూ.7.50 లక్షల వరకు పరిహారంగా అందుతుంది. అయితే పాలసీలో పేర్కొన్న విధంగా ప్రయాణీకుల పరిస్థితులపై ఆధారపడి అందుబాటులో ఉన్న మెుత్తం చెల్లించటం జరుగుతుంది. అలాగే ప్రమాదం వల్ల ఆస్పత్రిపాలైతే అందుకోసం ఇన్సూరెన్స్ కవర్ కింద చికిత్స కోసం రూ.2 లక్షల వరకు ఇస్తారు.

ప్రయాణ సమయంలో ఇన్సూర్ చేసిన ప్రయాణీకుడు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. అలాగే ప్రయాణీకుల నివాస స్థలానికి లేదా దహన సంస్కారాలకు లేదా ఖననం చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీ రవాణా ఖర్చుల కోసం రూ.10,000 చెల్లిస్తుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకున్న బాధితుడు లేదా వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందేందుకు అర్హులు. క్లెయిమ్ పొందేందుకు ఎల్ఐసీ బీమా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి స్టేట్మెంట్ అందించాల్సి ఉంటుంది.




