ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేయించిన పల్లీల మిశ్రమాన్ని తీసుకొని, దానితో పాటు రెండు రెబ్బల చింతపండు (పులుపు కోసం), 10-12 వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, ఒకటిన్నర నుండి రెండు టీ స్పూన్ల కారం, పావు టీ స్పూన్ పసుపు వేసి బరకగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఈ కారప్పొడిని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, వేయించిన కాకరకాయల్లో నిండుగా స్టఫ్ చేయాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, అదే కడాయిలో నూనె తక్కువగా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోవాలి. ఇందులో అర టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి లైట్ గా ఫ్రై చేయాలి. పోపు దినుసులు వేగాక, ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు (బిర్యానీకి తరగినట్లు సన్నగా), నాలుగైదు చితకకొట్టిన వెల్లుల్లిపాయలు, రెండు రెబ్బల కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు సగం వేగాక, ముందుగా తరిగి పెట్టుకున్న కాకరకాయ గింజలను వేసి మరో రెండు మూడు నిమిషాలు ముదురు ఎరుపు రంగులోకి వచ్చేవరకు ఫ్రై చేయాలి.