- Telugu News Photo Gallery Forest officials finds water streams from a big tree in the forest of Devipatnam mandam in Alluri district.
AP News: చెట్ల నుంచి లీటర్ల కొద్దీ జలధారలు.. చూసి షాకైన అటవీ శాఖ అధికారులు..
జలవృక్షాలను కథల్లో విన్నాం. సినిమాల్లో మాత్రమే ఇలాంటి జలవృక్షాలను చూస్తుంటాం. బాలక్రిష్ణ నటించిన భైరవద్వీపం సినిమాలో తల్లికోసం అటవీ ప్రాంతంలో ఉన్న జల వృక్షము నుండి నీటిని తీసుకొచ్చే సన్నివేశం గుర్తుందా. సరిగ్గా అలాంటిదే నిజ జీవితంలో నల్లమద్ది చెట్టు నుండి నీరు రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Pvv Satyanarayana | Edited By: Srikar T
Updated on: Mar 30, 2024 | 4:02 PM

అల్లూరి జిల్లా, దేవీపట్నం మండలం, పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో అద్భుతం చోటుచేసుకుంది. ఇటీవల టేకు చెట్ల వివాదం పై అటవీ ప్రాంతంలోని చెట్లను పరిశీలనకు అటవీ అధికారులు వెళ్లారు. ఈ నేపథ్యంలో కింటుకూరు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులకు నల్లమద్ది వృక్షం కనివిప్పు చేసింది.

చెట్లను పరిశీలిస్తున్న క్రమంలో నల్లమద్ది చెట్టును అటవీ సిబ్బంది కత్తితో నరకగానే ఒక్కసారిగా చెట్టు నుండి జలధారా రావడంతో అధికారులు అవాక్కయ్యారు. అటవీ ప్రాంతంలో నల్లమద్ది చెట్లు ఉండడం సమంజసం కానీ ఇలా అరుదైన చెట్టు కింటుకూరు ప్రాంతంలో కనబడటంపై అధికారులు వీడియోను చిత్రీకరించారు.

చెట్టు నుండి సుమారు 10 నుండి 15 లీటర్ల వరకు నీరు రావడం గమనించామని డిఎఫ్ఓ నరేంద్రన్ తెలిపారు. సుమారు 40 సంవత్సరాలు ఉన్న చెట్ల నుండి ఈ జలధార వచ్చిందని అధికారులు తెలిపారు. జలవృక్షాన్ని కనిపెట్టడానికి కొన్ని ప్రత్యేక గుర్తులు ఉంటాయి.

అన్ని చెట్లకు నీరు రాదని పేర్కొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ చెట్లకు మాత్రమే నీరు వస్తుందని చెప్పారు. ఈ నీటిని కింటకూరు బేస్ క్యాంప్లో ఉన్న డీఎఫ్ఏ నరేంద్ర తాగి చూశారు. కొన్ని సందర్భాల్లో అటవీ శాఖ సిబ్బంది ఈ జలవృక్షం నీటితో దప్పిక తీర్చుకుంటారని తెలిపారు.

ఇందుకూరు రేంజ్ అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలాధారా వృక్షం వీడియోను నెటిజన్లు వాట్సప్లో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం జల వృక్షాల విషయం ఆసక్తికరంగా మారింది.



















