బెంగాల్ లో మమతా బెనర్జీని కలిసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, తృణమూల్ తో పొత్తుకు అవకాశాలు ?
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోమవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆమె కార్యాలయంలో కలిశారు. ఈ రాష్ట్ర ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తుకు గల అవకాశాలపై ఉభయులూ చర్చించినట్టు తెలుస్తోంది.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సోమవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆమె కార్యాలయంలో కలిశారు. ఈ రాష్ట్ర ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తుకు గల అవకాశాలపై ఉభయులూ చర్చించినట్టు తెలుస్తోంది. బీహార్ లో మాత్రమే తమ పార్టీ కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ మమత దీదీతో కలిసి బీజేపీపై పోరాడుతామని ఆతరువాత ఆయన చెప్పారు. సీట్ల పంపిణీ అంశం ఇంకా తమ తమ మధ్య ప్రస్తావనకు రాలేదన్నారు. బెంగాల్ లో హిందీ మాట్లాడే ప్రజలు చాలామంది ఉన్నారని, సీఎం మమతకు మద్దతు ఇవ్వాలని వీరిని కోరుతానని ఆయన తెలిపారు. అలాగే తమ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఆర్జేడీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సపోర్ట్ ఇవ్వాలని కోరారన్నారు.
మమతా బెనర్జీ అంటే మాకు ఎంతో గౌరవం.. ఆమెకు మద్దతు ఇవ్వడమేగాక దేశాన్ని విడదీయాలని చూసే బీజేపీని గట్టిగా ఎదుర్కొంటాం అని తేజస్వి యాదవ్ చెప్పారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని,కానీ ఆ పార్టీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన అన్నారు. ఇక మమతా బెనర్జీ కూడా తేజస్వి యాదవ్ పార్టీకి పూర్తి సపోర్ట్ ఇస్తామని ప్రకటించారు. జైలు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ ని ప్రభుత్వం విడుదల చేయలేదని, రిలీజ్ చేస్తే బీహార్ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి తెలుసునని ఆమె చెప్పారు. బీహార్ లో బీజేపీ పై తేజస్వి పోరాటం జరుపుతున్నారని, తాము ఇక్కడ కూడా ఆపార్టీపై పోరు సలుపుతున్నామని ఆమె అన్నారు. అసలు ఈసీ ఎన్నికలషెడ్యుల్ ని ఎలా నిర్ణయించిందో చూడండి అని ఆమె ఆగ్రహంతో అన్నారు. బెంగాల్లో 33 రోజుల్లో ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. ఇది బీజేపీ ఎత్తుగడ అని ఆమె వ్యాఖ్యానించారు. కానీ ఈ ఎత్తుగడలను సాగనివ్వబోమన్నారు. బెంగాల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది.
మరిన్ని ఎక్కడ చదవండి:
ఎన్నికల వేళ, గిరిజన యువతులతో డ్యాన్సుల హేల , అస్సాంలో ప్రియాంక గాంధీ రూటే వేరు !