Air India scam: ఎయిర్ ఇండియాలో టిక్కెట్ల స్కామ్.. 4,000 మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైన యాజమాన్యం!
ఎయిర్ ఇండియా యాజమాన్యం తన ఉద్యోగుల క్రమశిక్షణ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేస్తోంది. టాటా గ్రూప్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా తన అంతర్గత వ్యవస్థలను ప్రక్షాళన చేసే క్రమంలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సంస్థ తన ప్రయాణ విధానాలను ప్రక్షాళన చేసే క్రమంలో, ఉద్యోగులకు కేటాయించిన ఉచిత, రాయితీ టిక్కెట్లలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ ఘటనపై యాజమాన్యం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎయిర్ ఇండియాలో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియాలో దశాబ్దాలుగా సాగుతున్న ఒక అక్రమ దందా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సంస్థ ఉద్యోగులకు లభించే ఫ్రీ ప్యాసేజ్ (Free Passage) సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ, వేల సంఖ్యలో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. సుమారు 4,000 మంది ఉద్యోగులు తమకు కేటాయించిన ఉచిత టిక్కెట్లను బయటి వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. దర్యాప్తు తర్వాత ఎయిర్ ఇండియా మోసానికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధపడింది. అసలు మోసం ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళితే..
విమానయాన సంస్థలు తమ సిబ్బందికి ప్రోత్సాహకంగా ఏడాదికి కొన్ని ఉచిత టిక్కెట్లను ఇస్తాయి. ఇవి కేవలం ఉద్యోగికి లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ, ఎయిర్ ఇండియాలోని కొందరు సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై, ఈ టిక్కెట్లను అపరిచితులకు విక్రయించారు. విదేశీ ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిక్కెట్లను భారీ ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా బాధ్యతలను టాటా గ్రూప్ స్వీకరించిన తర్వాత, సంస్థలోని ప్రతి విభాగాన్ని డిజిటలైజ్ చేస్తూ పారదర్శకతను పెంచుతోంది. ఈ క్రమంలోనే పాత రికార్డులను, టిక్కెట్ బుకింగ్ విధానాలను పరిశీలించగా ఈ భారీ అవకతవకలు బయటపడ్డాయి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందా వల్ల సంస్థ ఆదాయానికి గండి పడటమే కాకుండా, నైతిక విలువలు దెబ్బతిన్నాయని యాజమాన్యం భావిస్తోంది.
ఎయిర్ ఇండియాలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించబడిన 4,000 మంది ఉద్యోగులపై సంస్థ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. ఇప్పటికే ప్రాథమిక ఆధారాల మేరకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు టిక్కెట్ బుకింగ్ సిస్టమ్లో మరిన్ని మార్పులు చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పుడు అలసత్వానికి నిలయంగా మారిన ఎయిర్ ఇండియాను, టాటా గ్రూప్ ఇప్పుడు కఠిన నిబంధనలతో మళ్లీ దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.




