‘ప్రధాని మన్మోహన్ నిర్ణయాలను సోనియా మార్చేవారు..‘ కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల వేళ 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మార్చేవారని వెల్లడించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మార్చేవారని వెల్లడించారు. యూపీఏ సర్కారు హయాంలో జూన్ 2011 నుంచి జూన్ 2013 వరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా ఉన్న ఆర్కే సింగ్ తాజాగా ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కీలక కామెంట్స్ చేశారు. ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ పూర్తి స్వతంత్రంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను సోనియా గాంధీ ప్రభావితం చేసే వారని ఆయన చెప్పుకొచ్చేవారు.
దీనికి సంబంధించి అప్పట్లో చోటుచేసుకున్న ఓ ఘటనను కూడా ఆర్కే సింగ్ గుర్తుచేసుకున్నారు. ప్రధాని అధ్యక్షతన జాతీయ విపత్తుల నిర్వాహణ సంస్థ(ఎన్డీఎంఏ)ని ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకొచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. దీనికి ప్రధాని సారథిగా, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనలు అడ్డుకుంటూ సోనియా గాంధీ లేఖ రాశారని వెల్లడించారు. స్వయంగా ప్రధాని దీనికి సారధిగా కాకుండా.. ప్రధాని నామినేట్ చేసిన వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉండాలని సోనియా గాంధీ సూచించినట్లు పేర్కొన్నారు. ఈ లేఖను నాటి హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ తనకు చూపించారని.. ఇది సరైన నిర్ణయం కాదని అప్పుడు హోం శాఖ జాయింట్ సెక్రటరీగా ఉన్న తాను అభిప్రాయపడినట్లు ఆర్కే సింగ్ వెల్లడించారు. తన వాదనతో శివరాజ్ సింగ్ పాటిల్ కూడా ఏకీభవించినట్లు తెలిపారు. 20-25 రోజుల తర్వాత సోనియా గాంధీ నుంచి దీనికి సంబంధించి మరో లేఖ రాగా.. దీన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదించినట్లు తెలిపారు.
యూపీఏ ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే సోనియా గాంధీ పాత్ర ఎక్కువని చెప్పేందుకు ఇదో ఉదాహరణగా ఆర్కే సింగ్ పేర్కొన్నారు. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్నారు. అయితే ఆ సమయంలో మన్మోహన్ సింగ్ నిర్ణయాలను సోనియా గాంధీ ప్రభావితం చేసేవారని విపక్ష నేతలు తరచూ ఆరోపిస్తున్నారు. మన్మోహన్ సింగ్ కేవలం కీలబొమ్మగా ఉండేవారని.. నిర్ణయాధికారం పూర్తిగా సోనియా గాంధీ చేతిలో ఉండేదన్న ఆరోపణలు ఉండేవి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాడు కీలక ప్రభుత్వ పదవిలో ఉన్న ఆర్కే సింగ్.. నాడు అధికార కారిడార్లో సోనియా గాంధీ ప్రభావంపై చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రధాని హోదాలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు మన్మోహన్ సింగ్కు లేకుండా పోయిందని ఆర్కే సింగ్ వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి.