AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని గల్లంతు..! పాపం.. వీళ్లు దారి తప్పారు.. చివరికి..!

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్‌లో భారీ వరదలు పోటెత్తాయి. సుర్వాల్ జలాశయం పొంగి పొర్లడంతో రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌ గ్రామంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి.. జలపాతాన్ని తలపిస్తోంది. పొలాల మీదుగా నీరు ఉధృతంగా ప్రవహించి జదవత గ్రామాన్ని ముంచెత్తడంతో విధ్వంసం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని గల్లంతు..! పాపం.. వీళ్లు దారి తప్పారు.. చివరికి..!
Van Swept In Banas River
Balaraju Goud
|

Updated on: Aug 27, 2025 | 5:36 PM

Share

కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాజస్థాన్‌లో భారీ వరదలు పోటెత్తాయి. సుర్వాల్ జలాశయం పొంగి పొర్లడంతో రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌ గ్రామంలో 2 కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడి.. జలపాతాన్ని తలపిస్తోంది. పొలాల మీదుగా నీరు ఉధృతంగా ప్రవహించి జదవత గ్రామాన్ని ముంచెత్తడంతో విధ్వంసం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. సవాయ్‌ మాధోపూర్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి రెండు ఇళ్లు, పలు దుకాణాలు, రెండు దేవాలయాలు కూలినట్లు అధికారులు తెలిపారు.

తాజాగా చిత్తోర్‌గఢ్ జిల్లాలో మంగళవారం (ఆగస్టు 26) రాత్రి ఒక భారీ ప్రమాదం జరిగింది. రాజ్‌సమంద్ జిల్లాలోని గదరి వర్గానికి చెందిన ఒక కుటుంబం గూగుల్ మ్యాప్‌పై ఆధారపడి తిరిగి వస్తుండగా బనాస్ నదిలో కొట్టుకుపోయారు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మందిలో ఐదుగురిని గ్రామస్తుల సాయంతో పోలీసులు రక్షించారు. ఒక బాలిక మరణించింది. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఈ సంఘటన రష్మి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సోమి-ఉప్రెడా కల్వర్టు వద్ద మంగళవారం రాత్రి 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ కల్వర్టు మూడు సంవత్సరాలుగా మూసివేసి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా దానిపై నీరు ప్రవహిస్తోంది. ఇది గమనించకుండా వెళ్లిన వాహనం ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.

కనఖేడాకు చెందిన ఈ కుటుంబం భిల్వారా జిల్లాలోని సవాయి భోజ్‌ను సందర్శించడానికి వెళ్ళింది. తిరిగి వచ్చే క్రమంలో వారు గూగుల్ మ్యాప్ ద్వారా ఇంటికి తిరిగి వెళ్ళే మార్గాన్ని సెర్చ్ చేశారు. ఆ మ్యాప్ వారిని సోమి-ఉప్రెడా కల్వర్ట్ వైపు మళ్లించింది. అది చాలా రోజులుగా మూసివేసిన మార్గాన్ని సూచించింది. పొరబడిన డ్రైవర్ వ్యాన్‌ను కల్వర్ట్‌ మీదుగా తీసుకెళ్లాడు. అక్కడ వ్యాన్ ఒక గొయ్యిలో చిక్కుకుంది. ఇంతలోనే వేగంగా వచ్చిన బలమైన ప్రవాహానికి వ్యాను కొట్టుకుపోయింది.

ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, సమీప గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదం తర్వాత, ఉదయం నుంచే సహాయక చర్యలు ప్రారంభించారు. గ్రామస్తులు, సహాయక బృందాలు పడవల సహాయంతో ఐదుగురిని రక్షించారు. వీరిలో మదన్‌లాల్ (25), హితేష్ (16), లీలా (18), కావ్యన్ష్ (9 నెలలు), అయాన్ష్ (9 నెలలు) ఉన్నారు. నీటిలో కొట్టుకుపోయిన వారిలో చందా (21), మమత (25), ఖుషి (4), రుత్వి (6) ఉన్నారు. అయితే, ఒక బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. మరో ముగ్గురు వ్యక్తుల జాడ ఇంకా కనిపించలేదు. వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మంది బంధువులు, గదరి వర్గానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదం తర్వాత, గూగుల్ మ్యాప్స్‌పై గుడ్డి నమ్మకం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వంతెనపై నీరు ప్రవహిస్తున్నప్పటికీ, హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ వాహనాన్ని కిందికి దించాలనే నిర్ణయం డ్రైవర్ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం, సివిల్ డిఫెన్స్ బృందం తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే సమాచారం లేకుండా వరద ప్రభావిత ప్రాంతాలలోకి ప్రవేశించవద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us