కావేరీ నదిలో శవమై తేలిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ సైంటిస్ట్.. ఏం జరిగిందో?
ప్రఖ్యాత ఆక్వాకల్చర్ శాస్త్రవేత్త, ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ (70) కావేరి నదిలో శవమై కనిపించారు. శ్రీరంగపట్నం సమీపంలోని కావేరీ నదిలో శనివారం తేలుతున్న అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..

మైసూర్, మే 12: భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ (70) కావేరి నదిలో శవమై కనిపించారు. శ్రీరంగపట్నం సమీపంలోని కావేరీ నదిలో శనివారం తేలుతున్న అతని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని ఆయన మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయ్యప్పన్ వ్యవసాయం, మత్స్య (ఆక్వాకల్చర్) శాస్త్రవేత్త. ICARలో మొదటి పంటయేతర శాస్త్రవేత్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నది ఒడ్డున సుబ్బన్న అయ్యప్పన్ బైక్ కనిపించిందని, ఆయన నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే దర్యాప్తు అనంతరం మాత్రమే నిర్ధారణకు రాగలమని పోలీసులు తెలిపారు. అయ్యప్పన్ మైసూరులోని విశ్వేశ్వర నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. మే 7 నుంచి కనిపించడంలేదనీ ఆయన కుటుంబ సభ్యులు మైసూరులోని విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీరంగపట్నంలోని కావేరి నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమంలో అయ్యప్పన్ తరచుగా ధ్యానం చేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. భారత్లో ‘నీలి విప్లవం’లో కీలక పాత్ర పోషించిన అయ్యప్పన్ ఉన్నట్లుండి నదిలో శవమై తేలడం చర్చణీయాంశంగా మారింది. కాగా ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ప్రఖ్యాత ఆక్వాకల్చర్ శాస్త్రవేత్త అయిన అయ్యప్పన్ మరణం మిస్టరీగా మారింది. దర్యాప్తు అనంతరం ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని మాండ్య జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మల్లికార్జున్ బాలదండి తెలిపారు. నది నుంచి వెలికితీసే సమయానికి ఆయన మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉందని, బాడీపై ఎటువంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. అయ్యప్పన్ మొబైల్ ఫోన్ను ఇంట్లోనే వదిలేసి వెళ్లాడని, ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ అయ్యప్పన్ తన కెరీర్లో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్వాటర్ ఆక్వాకల్చర్ డైరెక్టర్, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ ఛైర్మన్తో సహా పలు కీలక పదవులను నిర్వహించారు. ‘నీలి విప్లవం’లో గణనీయమైన పాత్ర పోషించినందుకు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ అయ్యప్పన్ కు 2022లో పద్మశ్రీ అవార్డు అందించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








