Gold Coins: రూ.1.3 కోట్ల విలువైన పురాతన బంగారు నాణేలు లభ్యం.. పంపకాల్లో విభేదాలతో బయటకు..
Historical Gold Coins Found: మహారాష్ట్రలో మూడు శతాబ్ధాల నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. పంపకాల్లో వివాదం ఏర్పడటంతో ఈ నాణేల వ్యవహారం..
Historical Gold Coins Found: మహారాష్ట్రలో మూడు శతాబ్ధాల నాటి బంగారు నాణేలు లభ్యమయ్యాయి. పంపకాల్లో వివాదం ఏర్పడటంతో ఈ నాణేల వ్యవహారం బయటపడింది. తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాణేలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పింప్రి-చిన్చ్వాడ్లోని చిఖ్లి ప్రాంతంలో రూ. 1.3 కోట్ల విలువైన 216 పురాతన బంగారు నాణేలు లభ్యమయ్యాయి. 2357 గ్రాముల బరువున్న ఈ బంగారు నాణేలు 1720-1750 నాటి కాలానికి చెందినవని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. ఈ బంగారు నాణేలపై రాజా మహ్మద్ షా అనే పేరును ఉర్దూ, అరబిక్లో ముద్రించి ఉందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. ఒక్కో నాణెం విలువ రూ.60,000 నుంచి రూ.70000 వరకూ ఉంటుందని తెలిపారు.
పింప్రి ప్రాంతంలోని నెహ్రూనగర్ సమీపంలోనున్న విఠల్ నగర్ నివాసి సద్ధాం సలార్ ఖాన్ పఠాన్ వద్ద పురాతన బంగారు నాణేలున్నాయని కొందరు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున పురాతన నాణేలు లభ్యమయ్యాయి. సద్దాం.. అతని మామ ముబారక్ షేక్, బావమరిది ఇర్ఫాన్ను వెంటపెట్టుకుని చిక్లిలో నిర్మాణ పనులకు వెళ్లాడు. అక్కడ తవ్వకాలు చేపడుతుండగా నాణేలు ఇవి బయటపడ్డాయి. దీంతో సద్దాం, మరో ఇద్దరు కలిసి ఈ నాణేలను ఇంటికి తెచ్చుకున్నారు.
ఈ క్రమంలో పంపకాల్లో విభేదాలు రావడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అత్యంత విలువైన పురాతన బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించారు. పురావస్తు శాఖ అధికారులు నాణేలపై పరిశోధనలు చేపట్టారు. అయితే అధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామని పోలీసులు వెల్లడించారు.
Also Read: