Ventilator Bill: జేబులు ఖాళీ చేసే వెంటిలేటర్ మాఫియాకు చెక్! కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త రూల్స్ ఇవే.. సామాన్యులకు రక్షణ!
ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స అంటేనే సామాన్యులకు గుండె కోత. ముఖ్యంగా వెంటిలేటర్ పేరుతో లక్షల రూపాయల బిల్లులు వేసి రోగుల కుటుంబాలను దోచుకుంటున్న ఘటనలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ అరాచకానికి అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆసుపత్రి యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వెంటిలేటర్లు వాడటం, అపారదర్శక బిల్లులు వేయడం సాధ్యం కాదు. రోగి కుటుంబ సభ్యుల ముందస్తు అనుమతి లేకుండా వెంటిలేటర్ చికిత్స ప్రారంభిస్తే.. ఆ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

వైద్యం వ్యాపారంగా మారుతున్న తరుణంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సామాన్యులకు ఊరటనిచ్చే కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వెంటిలేటర్ అనేది ప్రాణాలను రక్షించే పరికరం కావాలి కానీ, ఆసుపత్రికి ఆదాయం తెచ్చే సాధనం కాకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనవసరంగా చికిత్స కాలాన్ని పొడిగించడం, ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యులను చీకటిలో ఉంచడం వంటి ఫిర్యాదులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) సీరియస్ అయింది. రోగి హక్కులను కాపాడుతూ జారీ అయిన ఈ కొత్త రూల్స్ ఏంటో చూద్దాం.
ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స వ్యయంపై పెరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొత్త నిబంధనలను రూపొందించింది. జవాబుదారీతనం, నీతిని పెంచడమే లక్ష్యంగా ఇవి జారీ అయ్యాయి.
కొత్త మార్గదర్శకాలలోని ముఖ్యాంశాలు:
ముందస్తు అనుమతి తప్పనిసరి: రోగి పరిస్థితిని బట్టి వెంటిలేటర్పై ఉంచే ముందు కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేయాలి. పరిస్థితి నివేదికను చూపి, వ్రాతపూర్వక అనుమతి పొందిన తర్వాతే చికిత్స ప్రారంభించాలి.
బిల్లు చెల్లించనవసరం లేదు: ఒకవేళ ఆసుపత్రి యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా లేదా అనుమతి లేకుండా వెంటిలేటర్ వాడితే, ఆ ఖర్చును చెల్లించాల్సిన బాధ్యత రోగి కుటుంబంపై ఉండదు.
స్పష్టమైన కారణం ఉండాలి: శ్వాసకోశ వైఫల్యం, గుండెపోటు, తీవ్రమైన గాయాలు వంటి నిర్దిష్ట కారణాల వల్ల మాత్రమే వెంటిలేటర్ వాడాలి. కేవలం బిల్లు పెంచడానికి దీనిని ఉపయోగించకూడదు.
వ్యవధి పొడిగింపు: ఒకవేళ చికిత్స సమయాన్ని పొడిగించాల్సి వస్తే, దానికి గల కారణాలను వివరిస్తూ కుటుంబం నుండి మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాలి. సాధ్యమయ్యే ఖర్చుపై ముందే స్పష్టత ఇవ్వాలి.
సమీక్షా కమిటీలు: 14 రోజుల కంటే ఎక్కువ కాలం వెంటిలేటర్ వాడాల్సి వస్తే, ఆసుపత్రిలో ప్రత్యేక ఆడిట్, సమీక్షా కమిటీల ద్వారా పర్యవేక్షణ ఉండాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.
ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్జంగ్ వంటి ప్రతిష్ఠాత్మక ఆసుపత్రుల వైద్యులతో కూడిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మార్పులు అమలులోకి వచ్చాయి.
