అదే జరిగితే మిగిలేది బిజెపి ఒక్కటే..!
వరుసగా సంచలనాత్మక నిర్ణయాలతో దూకుడు మీదున్న మోదీ-అమిత్షా మరో సంచలన వ్యూహాన్ని రచిస్తున్నారు. తాజాగా ఎన్డీయే -2 సర్కారు మరో సాహసోపేత నిర్ణయం దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్ష తరహా పాలన దిశగా ఆలోచిస్తున్న బీజేపీ పెద్దలు . లోక్సభకు జాతీయపార్టీలు మాత్రమే పోటీ చేసేలా రాజ్యాంగ సవరణ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కుదేలైపోయిన కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే, కాస్తో కూస్తో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా దెబ్బతీయడానికే ఈ […]

వరుసగా సంచలనాత్మక నిర్ణయాలతో దూకుడు మీదున్న మోదీ-అమిత్షా మరో సంచలన వ్యూహాన్ని రచిస్తున్నారు. తాజాగా ఎన్డీయే -2 సర్కారు మరో సాహసోపేత నిర్ణయం దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్ష తరహా పాలన దిశగా ఆలోచిస్తున్న బీజేపీ పెద్దలు . లోక్సభకు జాతీయపార్టీలు మాత్రమే పోటీ చేసేలా రాజ్యాంగ సవరణ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కుదేలైపోయిన కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే, కాస్తో కూస్తో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను కూడా దెబ్బతీయడానికే ఈ ఆలోచన చేస్తున్నారా? అదే నిజమైతే ఈ ఆలోచనపై ప్రాంతీయపార్టీలు ఎలా స్పందిస్తాయి? ఇవే ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా ప్రశ్నలు
మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తోంది. దశాబ్దాల తరబడి వెంటాడుతున్న సమస్యలను సాహసోపేతంగా పరిష్కరిస్తోంది. కేవలం ఆరేడు నెలల్లోనే అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. ఇదే దూకుడుతో లోక్సభ ఎన్నికల్లో కేవలం జాతీయపార్టీలే పోటీ చేసేలా చట్ట సవరణ తీసుకు వచ్చే ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దేశంలో అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం దిశగా దేశాన్ని నడిపించడానికిది తొలిమెట్టుగా భావిస్తున్నారు. ఇదే జరిగితే ప్రాంతీయపార్టీల మనుగడ ఇబ్బందుల్లో పడొచ్చు.
బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో చాలా వాటిని ఇప్పటికే నెరవేర్చింది. కశ్మీర్ కోసం రాజ్యాంగంలో నిర్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దాంతో పాటు 35-ఎ కూడా రద్దయింది. ఇక ముస్లిం సమాజంలో ఆచరణలో ఉన్న ట్రిపుల్ తలాఖ్ని చట్టవ్యతిరేకం చేసేసింది. అంతే కాకుండా దశాబ్దాల తరబడి నలుగుతున్న రామజన్మభూమి కేసులో కూడా తీర్పు వెలువడేలా చక్రం తిప్పింది. ఈ విషయంలో సత్వర తీర్పు వెలువడేలా బీజేపీ. దాని అనుబంధ సంస్థలూ కీలకపాత్ర పోషించాయి. బహుశా త్వరలోనే కామన్సివిల్కోడ్పైనా మోదీ సర్కారు దృష్టి పెట్టొచ్చు.
మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు సాహసోపేత నిర్ణయాలతోపాటు, ఎన్నికల సంస్కరణలపైనా ఫోకస్ పెడుతోంది. దేశ రాజకీయవ్యవస్థను అధ్యక్ష తరహాలోకి మార్చాలన్న ఆలోచన కూడా చేస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే లోక్సభకు కేవలం జాతీయపార్టీలు మాత్రమే పోటీచేసేలా రాజ్యాంగసవరణ తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. మోదీ- అమిత్షాల దూకుడుకి ఇప్పటికే కాంగ్రెస్పార్టీ కకావికలమైంది. దక్షిణాదితో సహా మరికొన్ని రాష్టాల్లో ప్రాంతీయపార్టీలు బలంగా ఉన్నాయి. కొన్ని జాతీయపార్టీలు ప్రాంతీయపార్టీల స్థాయికి కుదించుకుపోతే, కొన్ని ప్రాంతీయపార్టీలు జాతీయస్థాయికి ఎగబాకటానికి ప్రయత్నిస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో కేవలం జాతీయపార్టీలకు మాత్రమే పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ఆలోచనపై ప్రాంతీయపార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. అలాగే రాజ్యాంగంలో రాసుకున్న సమాఖ్య స్ఫూర్తి దెబ్బతినకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్నది కూడా ప్రశ్నార్థకమే!




