బెంగాల్ రాజకీయంలో పెను తుఫాను.. రెబెల్స్ షాక్తో సోనియా గాంధీతో మమతా అత్యవసర భేటీ!
బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను తుఫాను చెలరేగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఇప్పుడు నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడింది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా పార్టీలోనే ఊహించని రీతిలో భారీ తిరుగుబాటు మొదలైంది. ఏకంగా 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్సభ ఎంపీలు మమతపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు

బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను తుఫాను చెలరేగింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఇప్పుడు నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడింది. మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా పార్టీలోనే ఊహించని రీతిలో భారీ తిరుగుబాటు మొదలైంది. ఏకంగా 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్సభ ఎంపీలు మమతపై అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. దీంతో కోల్కతా నుండి ఢిల్లీ వరకు రాజకీయ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో టీఎంసీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత తొలుత 58 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక వర్గంగా ఏర్పడగా, ఆ సంఖ్య ఇప్పుడు 61కి చేరింది. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా, లోక్సభలో కూడా మమతకు పెద్ద షాక్ తగిలింది. తాము ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డామని, తమను గుర్తించాలని కోరుతూ 20 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించినట్లు రెబెల్ వర్గం నాయకురాలు కాకోలీ ఘోష్ దస్తిదార్ సంచలన ప్రకటన చేశారు. మరోవైపు, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సమన్లు జారీ చేసేందుకు సీఐడీ బెంగాల్ బృందం కాళీఘాట్లోని ఆమె నివాసానికి చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ తీవ్ర సంక్షోభం మధ్య, ఢిల్లీలో జరిగిన ఇండియా (INDIA) బ్లాక్ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఎంసీలో తిరుగుబాటు కొనసాగుతున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ.. మమతా బెనర్జీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని సంఘీభావం ప్రకటించారు. అనంతరం మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీతో టీఎంసీ-కాంగ్రెస్ విలీన వార్తలకు మరింత బలం చేకూరింది. “నేను ఇప్పుడు స్వేచ్ఛా పక్షిని. నాకు ఎలాంటి బాధ్యత లేదు.. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటే అది చేయగలను. ఇకపై ఇండియా బ్లాక్ను మరింత బలోపేతం చేస్తాను” అని బెంగాల్ ఎన్నికల ఓటమిపై మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు మమతా వర్గానికి చెందిన ఎంపీలు మహువా మోయిత్రా, కళ్యాణ్ బెనర్జీ, కీర్తి ఆజాద్లు మాత్రం చీలిక వర్గానికి తగినంత బలం లేదని వాదిస్తున్నారు. రెబెల్స్ ఒక వర్గంగా విడిపోయి బీజేపీలో చేరాలంటే మూడింట రెండు వంతుల మంది ఎంపీలు ఉండాలని, ప్రస్తుతం ప్రతిపక్ష వర్గంలో 19 మంది ఎంపీల కొరత ఉందని వారు చెబుతున్నారు. ఆప్, డీఎంకే మినహా 23 పార్టీలు హాజరైన ఈ ఇండియా బ్లాక్ భేటీ అనంతరం బెంగాల్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
