AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook: భారత్‌లో ఫేస్‌బుక్ సేవల్ని నిలిపివేస్తాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు

కర్ణాటక హై కోర్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియాలో ఓ భారతీయుడ్ని అరెస్టు చేసిన విషయంపై స్పందించిన హైకోర్టు.. భారత్‌లో ఫేస్‌బుక్ సేవలు నిలిపివేస్తామంటూ హెచ్చరించింది. తన భర్తను జైలు నుంచి విడిపించాలని కోరుతూ అతని భార్య చేసిన పిటీషన్‌పై స్పందించి ఈ వ్యాఖ్యలు చేసింది.

Facebook: భారత్‌లో ఫేస్‌బుక్ సేవల్ని నిలిపివేస్తాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హైకోర్టు
Facebook And Karnataka Hc
Aravind B
|

Updated on: Jun 15, 2023 | 12:16 PM

Share

కర్ణాటక హై కోర్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియాలో ఓ భారతీయుడ్ని అరెస్టు చేసిన విషయంపై స్పందించిన హైకోర్టు.. భారత్‌లో ఫేస్‌బుక్ సేవలు నిలిపివేస్తామంటూ హెచ్చరించింది. తన భర్తను జైలు నుంచి విడిపించాలని కోరుతూ అతని భార్య చేసిన పిటీషన్‌పై స్పందించి ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ పిటీషన్‌లో ఉన్న వివరాల ప్రకారం.. దక్షిణ కన్నడ జిల్లాలోని మంగళూరుకు సమీపంలో కవిత అనే మహిళ తన పిల్లలతో కలిసి ఉంటుంది. అయితే ఆమె భర్త శైలేష్ కుమార్ అనే వ్యక్తి(52) గత 25 ఏళ్లుగా సౌది అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2019లో కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను తీసుకొచ్చినప్పుడు.. ఆమె భర్త ఈ చట్టాలకు మద్దతిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అతని పేరు మీద ఓ నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచారు. అందులో సౌది అరేబియా రాజు, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా అభ్యంతకర పోస్టులు చేశారు.

ఇది తెలుసుకున్న శైలేష్ కుమార్ ఈ విషయానికి సంబంధించి తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దీంతో అతని భార్య కవిత దీనిపై మంగళూరులోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే శైలేష్ కుమార్‌ను సౌదీ అరేబియాలోని పోలీసులు అరెస్టు చేసి జైల్లో నిర్భందించారు. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు శైలేష్‌కు సంబంధించిన నకిలీ ఫెస్‌బుక్ ఖాతాపై వివరాలు తెలియజేయాలంటూ ఫేస్‌బుక్‌ సంస్థకు లెటర్ రాశారు. కానీ ఫేస్‌బుక్ స్పందించలేదు. అయితే ఈ విచారణ ఆలస్యం కావడంతో 2021లో కవిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. జైలు నుంచి తన భర్తను విడిపించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. దీనిపై తాజాగా కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది.

ఓ తప్పుడు కేసులో శైలేష్ కుమార్‌ను సౌదీలో అరెస్టు చేశారని తేల్చింది. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలటూ ఆదేశించింది. మంగళూరు పోలీసులు కూడా ఈ కేసుపై సరైన విచారణ చేసి..నివేదికను సమర్పించాలంటూ ఆదేశించింది. అలాగే వారం రోజుల్లోగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టులో సమర్పించాలంటూ ఫేస్‌బుక్‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. చర్యలు తీసుకోకపోతే ఫేస్‌బుక్‌ సేవలను భారత్‌లో నిలిపివేసే ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటామని హెచ్చరించింది. జూన్ 22 కు తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us