AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Assembly Polls: రసవత్తరంగా కేరళ వ్యూహాలు.. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యలో బీజేపీ.. ఈసారి త్రిముఖపోటీ ఖాయం!

కేరళ రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. బెంగాల్, తమిళనాడులకు భిన్నంగా అండర్ డాగ్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్ చోటుచేసుకుంటున్న కేరళలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

Kerala Assembly Polls: రసవత్తరంగా కేరళ వ్యూహాలు.. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యలో బీజేపీ.. ఈసారి త్రిముఖపోటీ ఖాయం!
Rajesh Sharma
|

Updated on: Feb 13, 2021 | 5:18 PM

Share

Interesting political developments in Kerala: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో బెంగాల్, తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలతో మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కుతూ హెడ్‌లైన్స్‌ను ఆక్రమిస్తుండగా.. కేరళ మాత్రం పెద్దగా వార్తలకు ఎక్కడం లేదు. బెంగాల్‌ దాడులు, ప్రతి దాడులతో అట్టుడుకుతోంది. శశికళ రాకతో తమిళ రాజకీయాలు కూడా వేడెక్కాయి. బంగారం స్మగ్లింగ్ వార్తలు, స్మగ్లింగ్‌కు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంతో లింకులు బహిర్గతం కావడంతో గత ఏడాది వార్తలకెక్కిన కేరళ గత కొంత కాలంగా వార్తల్లో లేదు. కానీ రాజకీయ పరిణమాలు మాత్రం కేరళలో అండర్ గ్రౌండ్‌లో వేగంగానే మారిపోతున్నాయి. వామపక్ష కూటమి అధికారంలో వున్న కేరళ రాష్ట్రం ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో కేరళ రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొదట్నించి లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్.డీ.ఎఫ్), యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యు.డీ.ఎఫ్)ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు కొనసాగుతుంది. ఒక ఎన్నికల్లో ఒక కూటమి ఆధిపత్యం సాధిస్తే.. తరువాతి ఎన్నికల్లో ఇంకో ఫ్రంట్‌ది పైచేయిగా కనిపిస్తూ వుంటుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా అక్కడ బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ నేతలకు అది అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో కేరళలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. దానికి తోడు రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కశ్మీర్, అయోధ్య, త్రిపుల్ తలాక్ వంటి అంశాల్లో ప్రదర్శించిన దూకుడు కేరళలో జాతీయ వాదులపై విశేష ప్రభావం చూపింది. దాంతో కేరళలో పాగా వేసేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలే కీలకమని భావిస్తున్న కమళదళం.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా వంటి దిగ్గజాలను ప్రచారానికి రప్పించేందుకు కేరళ బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

మరోవైపు అధికారంలో వున్న ఎల్.డీ.ఎఫ్. గత అయిదేళ్ళలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. దానికి తోడు కరోనా వంటి పాండమిక్ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభావ వంతంగా వ్యవహరించారన్న పాజిటివ్ టాక్‌ను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వామపక్ష నేతలు రెడీ అవుతున్నారు. ఇందుకోసం త్వరలోనే కేరళలో రెండు అతిపెద్ద ఎన్నికల ర్యాలీలను నిర్వహించేందుకు ఎల్.డీ.ఎఫ్. నేతలు సిద్దమవుతున్నారు. కాగా కేరళలో ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ నేతలు మాత్రం విజయన్ వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు.. అవినీతి, ఆశ్రిత పక్షపాతం అనే రెండంశాలను ఆధారంగా చేసుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

అవినీతి, పెద్ద ఎత్తున అక్రమ నియామకాలు కేరళలోని పినరయి విజయన్‌ సర్కారు వైఫల్యాలకు నిదర్శనాలని యూడీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యాక్‌ డోర్‌ నియామకాల పేరిట విజయన్ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని ఇటీవల పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ర్యాంకర్లు చేసిన ఆందోళన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అజెండాగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ భావిస్తోంది. తమ యువజన విభాగాలతో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తోంది.

అధికార ఎల్.డీ.ఎఫ్.పై వచ్చిన అవినీతి ఆరోపణలు, బ్యాక్‌డోర్‌ నియామకాల ఆరోపణలు ఎల్‌డీఎఫ్‌పై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వీటికి తోడు తాజాగా పబ్లిక్‌ కమిషన్‌ ర్యాంకర్లు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ర్యాంకు లిస్టు చెల్లుబాటును పొడిగించాలని డిమాండ్‌ చేస్తున్న వారు.. తమను కాదని ప్రభుత్వం తాత్కాలికంగా ఉద్యోగులను నియమించుకుంటోందని ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. ప్రభుత్వం మరో ఆరు నెలల గడువు పొడిగించినా అభ్యర్థులు నిరసనలు విరమించలేదు. వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. ప్రభుత్వంలో ఎంతోకాలం పనిచేసిన తాత్కాలిక ఉద్యోగులను మానవీయ కోణంలో క్రమబద్దీకరిస్తున్నామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియ ప్రస్తుత పీఎస్సీ ర్యాంకర్ల అవకాశాలపై ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. అయినా తాత్కాలిక నియామకాలపై నిరసనకారులు ఆందోళన చెందుతున్నారు.

దీనికి తోడు యావత్ దేశాన్ని కుదిపేసిన బంగారం స్మగ్లింగ్ విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల జోక్యం వెలుగులోకి రావడం సీఎం విజయన్‌కు ఇబ్బందికరమైన అంశంగా మారుతోంది. బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి కేరళ ముఖ్యమంత్రి మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్‌ను కస్టమ్స్ విభాగం పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కొచ్చిలోని ప్రత్యేక (పీఎంఎల్ఏ) కోర్టులో కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివశంకర్ ప్రస్తుత ప్రభుత్వంలోను కీలక వ్యక్తి అని పేర్కొనడం ముఖ్యమంత్రి విజయన్‌కు ఇబ్బంది కలిగించే అంశం. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రాన్ని అందించే విషయం. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఆయన పాత్రపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ పేర్కొంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కస్టమ్స్ విభాగం దర్యాప్తు చేస్తున్న ఈ కేసు కేరళలో దౌత్య మార్గాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న బంగారానికి సంబంధించినది. 2020 జులై 5వ తేదీన కేరళ రాజధాని తిరువనంతపురం (త్రివేండ్రమ్)లో రూ.14.82 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారుల వాహన శ్రేణిపై కొందరు దాడులకు యత్నించారన్న కథనాలు ప్రభుత్వాధినేతలకు మకిలిగా మారుతున్నాయి. దీనికి తోడు దేశాన్ని కరోనా పట్టిపీడిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తుందంటూ వామపక్ష మీడియా ప్రచారాన్ని హోరెత్తించింది. కానీ చివరికి ఎక్కువ స్థాయిలో కరోనా బారిన పడిన రాష్ట్రాలలో ఒకటిగా కేరళ నిలిచింది. అధిక సంఖ్యలో కేసులు నమోదు అవడం, ప్రాణనష్టం కూడా అధికంగానే జరగడం, వైరస్ నియంత్రణకు సుదీర్ఘ కాలం తీసుకోవడంతో తొలుత వచ్చిన సానుకూల ప్రచారం కాస్తా కేరళ ప్రభుత్వానికి ప్రతికూల ప్రచారంగా మారిపోయింది.

గతంలో నిఫా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న చరిత్ర, అనుభవం కలిగిన అధికార యంత్రాంగం కలిగిన కేరళ కరోనా నియంత్రణకు మాత్రం చాలా రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంది. వైరస్ సోకిన వారిని గుర్తించడంతో అనుభవం కలిగిన అధికార యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేయడంలో విజయన్ ప్రభుత్వం విఫలమైందన్న కామెంట్లు కూడా బాగానే వినిపించాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు అవినీతి, ఆశ్రిత బంధుప్రీతి.. ఇంకోవైపు స్మగ్లింగ్, కరోనా నియంత్రణలో వైఫల్యం వెరసి విజయన్ ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గతంలో ముఖాముఖిగా ఎల్.డీ.ఎఫ్., యూ.డీ.ఎఫ్. కూటముల మధ్య ద్విముఖంగా కొనసాగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల పర్వం ఈసారి త్రిముఖం కానున్నదన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

Also read: భారత్, చైనా మధ్యలో రాహుల్.. ఎడతెగని వాదోపవాదాలు.. పాంగాంగ్ ఉపసంహరణ వెనుక మర్మమేంటి?

Follow Us