Indian Railways: రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ 7 ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
విభిన్న సంస్కృతులు, గొప్ప చరిత్ర కలిగిన భారతదేశాన్ని చుట్టిరావాలంటే ఇండియన్ రైల్వేస్ ఉత్తమమైన మార్గంగా చెప్పొచ్చు. 7,000 స్టేషన్లతో అతిపెద్ద ట్రావెల్ నెట్వర్క్ కలిగి ఉండి, ప్రతిరోజూ 23 మిలియన్లకు..

విభిన్న సంస్కృతులు, గొప్ప చరిత్ర కలిగిన భారతదేశాన్ని చుట్టిరావాలంటే ఇండియన్ రైల్వేస్ ఉత్తమమైన మార్గంగా చెప్పొచ్చు. 7,000 స్టేషన్లతో అతిపెద్ద ట్రావెల్ నెట్వర్క్ కలిగి ఉండి, ప్రతిరోజూ 23 మిలియన్లకు పైగా ప్రయాణీకులు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. అయితే, రైలు ప్రయాణం అంత ఈజీ ఏమీ కాదు. రైళ్లలో ప్రయాణించే వారు.. అందుకు సంబంధించిన అన్ని విషయాలు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. రైల్వే డిపార్ట్మెంట్ కొన్ని నిబంధనలు పెట్టింది, ఆ నిబంధనలను ప్రతి ప్రయాణికుడు తప్పక పాటించాల్సి ఉంటుంది. లేదంటే ప్రయాణికులు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 7 ప్రధాన నిబంధనలు ఉన్నాయి. మీకోసం వాటి వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.
1. టిక్కెట్ తప్పనిసరి..
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే టిక్కెట్ కలిగి ఉండాలి. టిక్కెట్లను ఆన్లైన్లో లేదా రైల్వే స్టేషన్లలో, అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు. చెల్లుబాటు అయ్యే టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. టికెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే భారీ జనిమానాతో పాటు.. జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
2. లగేజ్..
ప్రయాణీకులు తమతో లగేజీని కూడా తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే లగేజీ బరువు పరిమితికి మించి ఉండకూడదు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీలో ప్రయాణించే వారు 40 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. ఇక థర్డ్ ఏసీ, చైర్ కార్లో ట్రావెల్ చేసేవారు 35 కేజీలు, స్లీపర్ క్లాస్కు 15 కేజీలు లగేజీని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది. ప్రయాణికులు ఎలాంటి మండే స్వభావం కలిగిన పదార్థాలు, ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతి లేదు.




3. ధూమపానం..
రైళ్లు, ప్లాట్ఫారమ్లు, స్టేషన్ ఆవరణలో ధూమపానం చేయడం నిషిద్ధం.
4. ఆహారం..
ప్రయాణీకులు తమవెంట సొంత ఆహారాన్ని తీసుకెళ్లవచ్చు. లేదంటే ప్లాట్ఫారమ్లోని ప్యాంట్రీ కార్, ఫుడ్ స్టాల్స్ నుండి కూడా ఆహారాన్ని కొనుగోలు చేయవచ్చు.
5. మద్యం..
రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో మద్యం సేవించడం నిషేధం. ఎవరైనా మద్యం సేవిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటుంది రైల్వే శాఖ.
6. క్యాన్సలేషన్..
ప్రయాణికుడు తమ టికెట్ను క్యాన్సిల్ చేయాలనుకుంటే ట్రైన్ షెడ్యూల్ కంటే ముందే క్యాన్సిల్ చేయాలి. అలా అయితేనే రిఫండ్ లభిస్తుంది. లేదంటే డబ్బు తిరిగి చెల్లించబడదు.
7. భద్రత..
ప్రయాణీకులు తమ వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణించేటప్పుడు విలువైన వస్తువులను తీసుకెళ్లకుండా ఉండాలని రైల్వే శాఖ సూచిస్తోంది. ట్రైన్లో సహ ప్రయాణీకులతో వాదనలు, తగాదాలకు కూడా దూరంగా ఉండాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..