ఆగని పాకిస్థాన్ అరాచకం.. LoCలో కాల్పులు! 10 మందిని పొట్టనపెట్టుకున్నారు..
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్ సైన్యం జమ్ము కశ్మీర్లోని ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారీ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో 10 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

ఆపరేషన్ సిందూర్తో బుద్ధి చెప్పినా.. పాకిస్థాన్ అగడాలు ఆగడం లేదు. జమ్మూ కశ్మీర్లోని ఎల్ఓసీ(లైన్ ఆఫ్ కంట్రోల్), అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ జరిపిన జరిగిన భారీ కాల్పుల్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు సహా పది మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై ఇండియా క్షిపణి దాడులు చేసిన తరువాత పాకిస్తాన్ సైనికులు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు భారత సైన్యం సమాన స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. కానీ, పాక్ సైనికులు సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు.
ఒక్క పూంచ్ జిల్లాలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో పది మంది గాయపడగా, రాజౌరి జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. 2025 మే 06-07 రాత్రి సమయంలో పాకిస్తాన్ సైన్యం జమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ, ఐబి(ఇంటర్నేషనల్ బార్డర్) వెంబడి ఉన్న పోస్టుల నుండి ఆర్టిలరీ షెల్లింగ్ తో సహా ఏకపక్ష కాల్పులకు పాల్పడింది” అని భారత సైన్యం తెలిపింది. విచక్షణారహితంగా జరిగిన కాల్పులు, షెల్లింగ్లో ముగ్గురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఇండియా బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత ఈ మరణాలు సంభవించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి