వామ్మో.. ఇక చుక్కలే.. వచ్చే 2 నెలలు నిప్పుల కొలిమే.. కేంద్రం హై అలెర్ట్..
భానుడు భగభగలాడుతున్నాడు.. మునుపెన్నడూ లేని విధంగా ఈ వేసవిలో వడగాల్పులు వీయనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల నుండి అంబులెన్స్ సన్నద్ధత వరకు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి? ఏయే రాష్ట్రాలపై వేడి ప్రభావం ఎక్కువగా ఉండనుంది..? అనేది తెలుసుకుందాం..

ఆ సారి ఎండలు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉండబోతుందన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున.. ప్రజారోగ్య పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపిన లేఖలో చేపట్టాల్సిన సన్నద్ధతా చర్యలను నొక్కి చెప్పారు.
కేంద్రం ఏం చెప్పిందంటే..?
ప్రత్యేక హీట్-స్ట్రోక్ యూనిట్లు : అన్ని ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేయాలి.
రియల్ టైమ్ రిపోర్టింగ్: వడదెబ్బ కేసులను సమీకృత ఆరోగ్య సమాచార వేదికలో ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.
అంబులెన్స్ సన్నద్ధత: అత్యవసర సమయాల్లో బాధితులను వేగంగా ఆసుపత్రికి తరలించేలా అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచాలి.
ముందస్తు హెచ్చరికలు: వాతావరణ మార్పులపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరికలను జారీ చేయాలి.
వడగాల్పుల ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటుంది..?
- ఐఎమ్డి అంచనాల ప్రకారం.. ఈ ఏడాది ఈ క్రింది ప్రాంతాల్లో వేడి తీవ్రత అధికంగా ఉండనుంది..
- తూర్పు – మధ్య భారతం: ఒడిశా, పశ్చిమ బెంగాల్.
- వాయువ్య భారతం: ఉత్తర భారతదేశంలోని మైదాన ప్రాంతాలు.
- తీర ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల్లో వడగాల్పుల ప్రభావం గణనీయంగా ఉండనుంది.
- పశ్చిమ భారతం: గుజరాత్, మహారాష్ట్ర మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు ప్రభావితం కానున్నాయి.
ప్రభుత్వ లక్ష్యం.. సున్నా మరణాలు
తీవ్రమైన వేడిమి వల్ల సంభవించే అనారోగ్యాలను తగ్గించడం, మరణాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం ఈ ప్రణాళికను సిద్ధం చేసింది. సమన్వయ యంత్రాంగాలను బలోపేతం చేసి, క్షేత్రస్థాయిలో మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. వేసవి తీవ్రత సన్నద్ధతా వ్యవస్థలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, ప్రజలు కూడా మధ్యాహ్న సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Letter written by the Health Secretary to all the state and UT Chief Secretaries. As per the IMD’S updated seasonal outlook for the hot weather season (April to June) 2026 and the monthly outlook for April 2026 for rainfall and temperature, it is highlighted that above-normal… pic.twitter.com/A9zJwN5xd9
— ANI (@ANI) April 27, 2026
