ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ‘బంగారు బెంగాల్’ చేసి చూపిస్తామంటున్న.. కేంద్ర హోం శాఖ మంత్రి
పశ్చిమబెంగాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రెండో రోజు పర్యటన విజయవంతంగా కొనసాగింది.
పశ్చిమబెంగాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రెండో రోజు పర్యటన విజయవంతంగా కొనసాగింది. బీర్భమ్ జిల్లాలోని బోల్పుర్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీకి అధికారం ఇస్తే బంగారు బంగాల్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మార్పు కోసం బంగాల్ ప్రజలు ఆరాటపడుతున్నారని రాజకీయ హింస, దోపిడీ, బంగ్లదేశీయుల చొరబాట్లు లేని రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నారని తెలిపారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే బంగారు బంగాల్ ను నిర్మిస్తామని పేర్కొన్నారు.
తన జీవితంలో చాలా రోడ్ షోలలో పాల్గొన్నారని, కానీ ఇలాంటి రోడ్ షోను ఎప్పుడూ చూడలేదని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ పట్ల బంగాల్ ప్రజల నమ్మకం, ప్రేమను ఈ రోడ్ షో తెలియజేస్తోందని అన్నారు. అలాగే మమతా దీదీ పట్ల బంగాల్ ప్రజల ఆగ్రహాన్ని కూడా సూచిస్తోందని ఛలోక్తి విసిరారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు దిల్లీ నుంచి ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రజలే మార్పు కోరుకుంటున్నారని అందుకోసం వారు సిద్దంగా ఉన్నారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాపై రాళ్లదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ఉండాలని, దీనికి బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడించారు.