Himachal Pradesh Election 2022: ఆ సంప్రదాయం కొనసాగుతుందా..? నేడే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు.. ఆ పార్టీల మధ్యే పోటీ..

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది.

Himachal Pradesh Election 2022: ఆ సంప్రదాయం కొనసాగుతుందా..? నేడే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు.. ఆ పార్టీల మధ్యే పోటీ..
Himachal Pradesh Elections
Follow us

|

Updated on: Nov 12, 2022 | 12:52 AM

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఆప్ కూడా బరిలో ఉండటంతో త్రిముఖ పోరు నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఎవరికీ పట్టం కడతారన్నది ఉత్కంఠ నెలకొంది. 1982 నుంచి ఒక దఫా బీజేపీ.. మరో దఫా కాంగ్రెస్‌కు అధికారం ఇస్తోన్న హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు.. ఈసారి అదే ఆనవాయితీని కొనసాగిస్తారా..? లేదా.. అందుకు భిన్నంగా చరిత్రను తిరగరాస్తారా.? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఎన్నికల సంఘం ప్రకారం..

  • హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాల సంఖ్య – 68
  • హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 55,92,828.. అందులో 27,37,845 మంది మహిళలు, 28,54,945 మంది పురుషులు, 38 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు.
  • హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 412 మంది అభ్యర్థులు ఉన్నారు.
  • ఈసారి మహిళా అభ్యర్థుల ప్రాతినిధ్యం – 24
  • ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడికానున్నాయి.

ఎన్నికల కోసం మొత్తం 7,881 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. కాంగ్రా జిల్లాలో అత్యధికంగా 1,625 పోలింగ్ స్టేషన్లు ఉండగా, లాహౌల్-స్పితి జిల్లాలో అత్యల్పంగా 92 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 7,235 పోలింగ్ స్టేషన్లు, పట్టణ ప్రాంతాల్లో 646 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అంతేకాకుండా, సిద్ధ్‌బరి (ధర్మశాల), బారా భంగల్ (బైజ్‌నాథ్), ధిల్లాన్ (కసౌలి)లలో మూడు సహాయక పోలింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేస్తారు. ఎన్నికల విధుల్లో 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 25 వేల మంది పోలీసులు, 7 వేల మంది సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది నిర్వహిస్తున్నారు.

త్రిముఖ పోటీ..!

గత ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీగా పోటీ సాగగా.. ఇప్పుడు ఆప్ కూడా బరిలో నిలిచింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పనితీరుతో మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్ తన ఎన్నికల వాగ్దానాలు ఓటర్లలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తోంది. కాగా.. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది. మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మూడు పార్టీలతో పాటు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ), రాష్ట్రీయ దేవభూమి పార్టీ (ఆర్‌డిపి) వంటి పార్టీలు పోటీలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

బీజేపీ నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధినేత జగత్ ప్రకాష్ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్‌తో సహా పార్టీ అగ్రనేతలు, ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారం చేశారు.

సెరాజ్‌లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ పై కాంగ్రెస్‌కు చెందిన చేత్రమ్ ఠాకూర్, ఆప్ అభ్యర్థి గీతా నంద్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ముఖేష్ అగ్నిహోత్రి హరోలి నుంచి పోటీ చేస్తుండగా.. ఇక్కడ బీజేపీ నుంచి రామ్‌కుమార్‌, ఆప్ నుంచి రవీందర్ పాల్ సింగ్ మాన్‌ పోటీ చేస్తున్నారు.

2017లో బీజేపీ..

కాగా.. 2017లో హిమాచల్‌లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గాను 44 సీట్లను బీజేపీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ కేవలం 21 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..