H3N2 Virus: ప్రమాద ఘంటికలు మోగిస్తున్న H3N2 వైరస్.. పెరుగుతున్న మరణాలు.. పిల్లలు, వృద్ధులపై దాడి
కరోనా కల్లోలం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు భారత్లో మరో వైరస్ విజృంభించేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఇన్ఫ్లూయెంజా చాపకింద నీరులా విస్తరిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
భారత దేశంలో ఇంఫ్లూయెంజా ప్రభావం తీవ్రరూపం దాలుస్తోంది. మెల్లమెల్లగా విస్తరిస్తున్న హెచ్3ఎన్2 వైరస్… ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో చాప కింద నీరులా పాకుతున్న ఈ వైరస్… తాజాగా పుదుచ్చేరినీ తాకింది. దీంతో, అక్కడ పాఠశాలలకు 10 రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సీజనల్ ఇన్ఫ్లుఎంజా H3N2 వైరస్తో పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోగ్యశాఖ ఇచ్చిన నివేదికతో… అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి 26 వరకు స్కూల్స్ మూసివేయాలని ఆదేశించింది.
చాన్నాళ్లుగా ఇంఫ్లూయెంజా H3N2 వైరస్ పేరు వినిపిస్తున్నా.. ఇటీవలే దీని ఎఫెక్ట్ ఎక్కువైనట్టు కనిపిస్తోంది. కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నాయి. జనవరి 2 నుంచి మార్చి 5 వరకు.. భారత్లో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ వైరస్తో మరణాలూ సంభవిస్తుండటం భయపెడుతోంది. మహారాష్ట్రలో ఒక విద్యార్థి, గుజరాత్లో మరో మహిళ. ఈ వైరస్కు బలయ్యారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో 82 ఏళ్ల వృద్ధుడు సైతం ఈ వైరస్ కారణంగానే మృతిచెందినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు.
తమిళనాడులో వేగంగా విస్తరిస్తున్న హెచ్3ఎన్2 వైరస్.. ఇప్పటి వరకూ అక్కడ దాదాపు 600మందికి సోకింది. తిరుచ్చికి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ అలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. అయితే, ఇప్పుడు వైరస్ గాలి.. పుదుచ్చేరి వైపు మళ్లినట్టు కనిపిస్తోంది. పిల్లలు, వృద్ధులపై దాడి చేస్తోంది కాబట్టి.. ముందు జాగ్రత్తగా స్కూల్స్ను మూసేసింది అక్కడి ప్రభుత్వం. ఇక, పరిస్థితి చూస్తుంటే కోవిడ్ ప్రోటోకాల్ను మళ్లీ పాటించాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చినట్టే కనిపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాస్క్లు ధరిస్తూ, సామాజిక దూరం పాటించడం మంచిదని సలహా ఇస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..