Delhi Weekend Curfew: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ..
ఒమిక్రాన్, కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతోన్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో వీకెండ్ కర్ఫ్యూను ప్రకటించింది కేజ్రివాల్ ప్రభుత్వం. అక్కడి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వర్క్ ఫ్రం హోం చేయనున్నారు.
దేశాన్ని కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ విజృంభిస్తోంది. కేసులు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి. దీంతో థర్డ్ వేవ్ ముంచుకొచ్చిందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ తీవ్రత కలవరపెడుతోంది. రెండు రోజులుగా అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కట్టడికి వీకెండ్ కర్ఫ్యూ విధించింది.
ఢిల్లీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూతో పాటు ఆంక్షలు అమలులో ఉన్నాయి. థియేటర్స్, పబ్బులు, బస్సులు, మెట్రోల్లో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషనిచ్చింది. ఐనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీజేపీ ఎంపీ మనీష్ తివారీ కూడా కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పాజిటివీటి రేటు 6.49 శాతంగా ఉంది. మరోవైపు మహారాష్ట్రలోనూ కరోనా విలయతాండవం చేస్తోంది. కొవిడ్తో పాటు ఒమిక్రాన్ పంజా విసిరింది. 24గంటల్లోనే 11వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
వాటిలో ముంబైలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా, ఒమిక్రాన్ విజృంభణతో ప్రస్తుతం అక్కడ 144సెక్షన్ అమలులో ఉంది. నైట్ కర్ఫ్యూ అమలుచేస్తున్నారు. ఐతే 20వేల కేసులు దాటితే ముంబైలో లాక్డౌన్ విధించే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు నగర మేయర్. ఇక పంజాబ్ ప్రభుత్వం కూడా నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. పంజాబ్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.